హైదరాబాద్: అద్దెకు వసతి కల్పించే ప్రొపర్టీ-టెక్ ప్లాట్ఫామ్ కోలివ్, మానవత్వాన్ని చాటుకున్నది. ఆఫ్ఘనిస్థాన్లో సంక్షోభం వల్ల భారత్లో చిక్కుకుపోయిన ఆఫ్ఘన్ విద్యార్థుల కోసం వంద ‘స్టే స్కాలర్షిప్’ స్కీమ్ను ప్రారంభించింది. దీని కోసం దేశంలోని ఆఫ్ఘన్ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. FRRO రిజిస్ట్రేషన్, కాలేజీ బోనఫైడ్ సర్టిఫికెట్, అన్ని KYC డాక్యుమెంట్లతోపాటు 30 సెకన్ల వీడియోను సబ్మిట్ చేయాలి.
ఎంపికైన ఆఫ్ఘన్ విద్యార్థులు కొలివ్ సంస్థకు చెందిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణేలోని గృహాల్లో ప్రస్తుత సెమిస్టర్ లేదా ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఉచితంగా ఉండవచ్చు. కాగా, ఇప్పటికే 15 మంది ఆఫ్ఘన్ విద్యార్థులు దరఖాస్తు చేయగా ఇందులో ఐదుగురు బెంగళూరులో ఉచితంగా వసతిని పొందినట్లు ఆ సంస్థ తెలిపింది.
ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ఫ్రీజ్, కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లేక భారత్లో విద్యనభ్యసించే ఆఫ్ఘన్ విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని కోలివ్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో సురేశ్ రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అలాంటి విద్యార్థులకు తమ వంతు సహాయం అందించేందుకు ఈ ఉచిత వసతి సౌకర్యం పథకం ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు.
కాగా, జైన్ యూనివర్సిటీలో చదువుతున్న ఆఫ్ఘన్ విద్యార్థి అబ్దుల్లా మసౌది ఈ ‘స్టే స్కాలర్షిప్’పై హర్షం వ్యక్తం చేశారు. భారతీయుల నిజమైన హృదయాన్ని, భారతీయ స్టార్టప్ వ్యవస్థ తీరుకు ఇది అద్దం పడుతున్నదని కొనియాడారు. వ్యాపారులు తమ లాభం కోసం చూసుకోవడం గురించి మాత్రమే ఇప్పటి వరకు తాము విన్నామని, కోలివ్ ‘స్టే స్కాలర్షిప్’తో వ్యాపారుల మానవతా సహాయాన్ని చూస్తున్నామని అన్నారు.
మరోవైపు, కోలివ్ ఇంతకు ముందు కూడా దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థులకు స్టే స్కాలర్షిప్ను అందించింది. ఎంపికైన విద్యార్థులకు మొత్తం సెమిస్టర్లో ఉచితంగా బస కల్పించింది. అయితే ఆహారం, వినియోగ వస్తువులకు మాత్రమే విద్యార్థులు ప్రతి నెలా చెల్లించాల్సి ఉంటుంది.