క్యూ1లో 37% పెరిగిన లాభం
న్యూఢిల్లీ, మే 6: ఐటీ దిగ్గజాల్లో ఒకటైన కాగ్నిజెంట్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ 505 మిలియన్ డాలర్ల నికర లాభాన్ని గడించింది. జనవరి-డిసెంబర్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా వ్యవహరిస్తున్న సంస్థకు అంతక్రితం ఏడాది ఇదే సమయంలో 367 మిలియన్ డాలర్ల ఆర్జించిన నికర లాభంతో పోలిస్తే 37.6 శాతం అధికం. అమెరికా కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్కు భారత్లో 2 లక్షల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. గత త్రైమాసికానికిగాను సంస్థ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 4.2 శాతం పెరిగి 4.4 బిలియన్ డాలర్లు ఆర్జించింది. తొలి త్రైమాసికంలో అన్ని విభాగాలు ఆశించిన స్థాయిలో వృద్ధిని నమోదు చేసుకున్నట్లు, ముఖ్యంగా డిజిటల్, అంతర్జాతీయ వ్యాపారాన్ని మరింత బలోపేతం చేయడానికి భారీగా పెట్టుబడులు పెట్టినట్లు కంపెనీ సీఈవో బ్రియాన్ హంఫరిస్ తెలిపారు. ఈ ఏడాది కొత్తగా 28 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు సంస్థ ప్రకటించింది.