బీజింగ్, జూన్ 17: చైనా తమ అంతరిక్ష కేంద్రం తియాన్హే నిర్మాణంలో భాగంగా ముగ్గురు వ్యోమగాములను రోదసిలోకి పంపించింది. వారు అక్కడ మూడు నెలలు ఉండి తియాన్హే నిర్మాణ పనుల్లో పాల్గొంటారు. గురువారం చైనాకు చెందిన వ్యోమనౌక షెన్జౌ-12లో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. గోబీ ఎడారిలోని జీయుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-2ఎఫ్ రాకెట్ ద్వారా వ్యోమనౌకను చైనా అంతరిక్ష కేంద్రం ఉన్న కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించారు. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రబల శక్తిగా ఎదగాలన్న చైనా లక్ష్యంలో ఈ ప్రయోగం ఓ మైలురాయి అని భావిస్తున్నారు. తియాన్హేను ఏప్రిల్ 29న అంతరిక్షంలోకి పంపించారు. దీని నిర్మాణానికి అవసరమైన పరికరాలతో కార్గో స్పేస్క్రాఫ్ట్ను మే 29న పంపించారు. తాజాగా ముగ్గురు వ్యోమగాములు కూడా వెళ్లారు. గత ఐదేండ్లలో చైనా చేపట్టిన తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ఇదే. అంతరిక్ష కేంద్రం వచ్చే ఏడాదికల్లా ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. చైనాలో కమ్యూనిస్టు పాలన ప్రారంభమై వచ్చే ఏడాదికి 100 ఏండ్లు నిండనున్న సందర్భాన్ని పురస్కరించుకొని చైనా అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఇది పూర్తైతే సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉన్న ఏకైక దేశంగా చైనా రికార్డు సాధిస్తుంది. అంతరిక్ష ప్రయోగాల్లో చైనా ఇటీవల దూకుడు కనబరుస్తున్నది. ఆరు నెలల క్రితం చంద్రుడి నుంచి రాళ్లు, మట్టి సేకరించి భూమికి తీసుకొచ్చింది. అంగారకుడిపై తమ రోవర్ను విజయవంతంగా ల్యాండ్ చేసింది.