పుణే : కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలో అమాయకుల బలహీనతలను ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్న నకిలీ సైనికుడిపై పుణే పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. కన్నడ తాలూకాకు చెందిన యోగేష్ దత్ గైక్వాడ్ తాను సైన్యంలో పనిచేస్తానని యువతికి నమ్మబలికాడు. తన తల్లితండ్రులిద్దరూ కరోనాతో దవాఖానలో చికిత్స పొందుతున్నారని చెప్పాడు.
యువతి సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానంటూ రూ లక్షలు గుంజాడు. ఆపై గైక్వాడ్ ఇంటికి తల్లితండ్రులతో కలిసి వచ్చిన యువతి మెడలో అతడు మూడుముళ్లు వేశాడు. నిందితుడి నిర్వాకం బయటపడటంతో యువతి ఫిర్యాదుపై బిబ్వేవాడి పోలీస్ స్టేషన్లో గైక్వాడ్పై కేసు నమోదైంది. నిందితుడు ఇలాగే 12 మందికి పైగా బురిడీ కొట్టించాడని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.