న్యూఢిల్లీ: వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. తమ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకునే విధంగా యూజర్లపై వత్తిడి చేయబోమని వాట్సాప్ కోర్టుకు చెప్పింది. తమ పాలసీని ఆమోదించనివారిపై కూడా ఎటువంటి ఆంక్షలు ఉండవని వాట్సాప్ కోర్టులో పేర్కొన్నది. కొత్త పాలసీని స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ తరపున వాదిస్తున్న న్యాయవాది హరీశ్ సాల్వే కోర్టుకు తెలిపారు. కానీ తమ యూజర్లకు మాత్రం ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుంటామని వాట్సాప్ వెల్లడించింది. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు చట్టంగా మారే వరకు ప్రైవసీ పాలసీని నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ పేర్కొన్నది.
ఫిబ్రవరిలో వాట్సాప్ తన కొత్త ప్రైవసీ పాలసీని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ విధానం పట్ల ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేసింది. వాట్సాప్ తన డేటాను పేరెంట్ కంపెనీ ఫేస్బుక్తో పంచుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పాలసీపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ప్రైవసీ పాలసీపై సమగ్రమైన సమాచారం ఇవ్వాలని ఇటీవల కంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) .. ఫేస్బుక్కు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులోనే వాట్సాప్కు నోటీసులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.