ూఢిల్లీ: కరోనా రెండో వేవ్ కేసులు తగ్గుతున్నాయని ఆంక్షల సడలింపు, వివిధ రాష్ట్రాల్లో లాక్డౌన్ ఎత్తివేతపై ఆచితూచి ముందుకు వెళ్లాలని కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సూచించింది. అన్ని కార్యకలాపాలను అనుమతించి మరో దఫా కరోనా వేవ్ ముప్పును తెచ్చుకోవద్దని సీఈఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ పేర్కొన్నారు.
కరోనా మూడో దశ ఉద్ధృతి పొంచి ఉన్నందున అన్లాక్ విషయమై ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని సీఐఐ ప్రెసిడెంట్ టీవీ నరేంద్రన్ సూచించారు.
సప్లయ్ చైన్ పునరుద్ధరణపై దృష్టి సారించాలని హితవు పలికారు. దీంతో ఆర్థిక వృద్ధి ఊపందుకుని ప్రజలకు జీవనోపాధి లభిస్తుందన్నారు.
‘అత్యవసరమైన రంగాలను తెరవడానికి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థిక కార్యకలాపాల పునరుద్ధరణ తప్పనిసరి. సామాజిక కార్యక్రమాల పునరుద్ధరణకు మరికొన్ని రోజులు వేచి ఉండొచ్చు. అలా చేసి ముప్పు కొని తెచ్చుకోవడం ఎందుకు’ అని నరేంద్రన్ వ్యాఖ్యానించారు.
కరోనా రెండ్ వేవ్ను కట్టడి చేయడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ వల్ల గత రెండు నెలల్లో ఆర్థిక వ్యవస్థ పట్టు తప్పిందని నరేంద్రన్ ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ వసూళ్లలో అది స్పష్టంగా కనిపించిందన్నారు.
ఇప్పటికైనా కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి రోజుకి కనీసం 71.2 లక్షల మందికి వ్యాక్సినేషన్ చేయాల్సి ఉందన్నారు. అప్పుడే డిసెంబర్ నాటికి యువజనులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయగలమన్నారు.