China Faces Shock- Chips@India | యావత్ ప్రపంచం ఇప్పుడు సెమీ కండక్టర్లు i.e. చిప్ల కొరతతో తల్లడిల్లుతోంది. ఇక భారత్లో ఆటోమొబైల్, గాడ్జెట్స్ ఇండస్ట్రీస్ మీద నేరుగా నెగెటివ్ ప్రభావం పడుతోంది. ఆటోమొబైల్ కంపెనీలు ప్రత్యేకించి కార్ల తయారీ సంస్థలు తమ ఉత్పత్తి లక్ష్యాల్లో కోత విధించేశాయి. కానీ ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. త్వరలో భారత్లోనే సెమీ కండక్టర్ల తయారీకి బీజం పడుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం తైవాన్, భారత్ మధ్య ఓ ఒప్పందం కుదరబోతున్నది. దీని ప్రకారం తైవాన్లోని సెమీ కండక్టర్ల తయారీ సంస్థలు భారత్లోనూ వాటిని తయారు చేయబోతున్నాయి. దీనివల్ల ధర కూడా తగ్గుతుంది.. ప్రత్యేకించి దిగుమతి సుంకం ఉండదు..
ప్రపంచ మార్కెట్కు అవసరమైన చిప్ల్లో 80 శాతం తైవాన్, దక్షిణ కొరియాల్లోనే ఉత్పత్తవుతాయి. ఈ పరిస్థితుల్లో తైవాన్, భారత్ మధ్య చర్చలు ఫలప్రదమైతే పాజిటివ్ పరిస్థితులు ఏర్పడతాయి. అయితే టెక్ నిపుణులు మాత్రం మనదేశంలోనే చిప్ల తయారీకి తైవాన్-భారత్ మధ్య ఒప్పందం కుదిరితే డ్రాగన్ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతినడంతోపాటు కొత్త వివాదం ముంచుకొచ్చే ప్రమాదం లేకపోలేదంటున్నారు.
భారత్లో చిప్ తయారీ ప్లాంట్ ఏర్పాటు విషయమై భారత్, తైవాన్ అధికారులు కొన్ని వారాలుగా చర్చలు జరుపుతున్నారు. భారత్లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ.55.23 వేల కోట్లు (7.5 బిలియన్ డాలర్లు) ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. భారత్లో తయారు చేసే చిప్లు 5జీ స్మార్ట్ ఫోన్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లలో వాడేందుకు అనువుగా ఉండబోతున్నాయి.
చైనాకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పాటైన ప్రజాస్వామ్య దేశాల అధినేతలు సమావేశమైనప్పుడు ఈ డీల్ రూపుదిద్దుకున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు తైవాన్తో ప్రాఫిటబుల్ డీల్ ఖరారు చేసుకున్నా.. మరోవైపు చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతాయేమోనన్న ఆందోళన వ్యక్తం అవుతున్నది. తైవాన్ను చైనా తమ అంతర్భాగం అని వాదిస్తున్నది. మరోవైపు తమది స్వతంత్ర దేశం అని పరిగణించాలని తైవాన్ చెబుతోంది.
ఇటీవల వాషింగ్టన్లో క్వాడ్ (అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్) కూటమి అధినేతలు సమావేశమైనప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ చిప్ల సరఫరా చెయిన్ వేగవంతం చేయాలని ప్రతిపాదించారని వినికిడి. చైనాను ఢీ కొట్టేందుకు క్వాడ్ గ్రూప్..భారత్లో చిప్ల తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం.
ఇప్పటి వరకు భారత్ ప్రతి యేటా చిప్ల దిగుమతికి రూ.1.77 లక్షల కోట్లు (24 బిలియన్ల డాలర్లు) ఖర్చు చేస్తోంది. ఇది 2025 నాటికి రూ.7.38 లక్షల కోట్ల (100 బిలియన్ల డాలర్లు)కు చేరుతుందని అంచనా. ఇదిలా ఉంటే ఇటీవల జియో ఫోన్ నెక్ట్స్ అనే పేరుతో రిలయన్స్ విడుదల చేయాల్సిన స్మార్ట్ ఫోన్ ఆవిష్కరణ జాప్యమైంది. సెర్చింజన్ గూగుల్తో భాగస్వామ్యం ఉన్నా.. చిప్ల కొరత ప్రధాన అవరోధంగా మారింది.