బీజింగ్: ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబాపై 100 కోట్ల డాలర్ల జరిమానా విధించాలని ప్రణాళిక రూపొందించినట్లు వచ్చిన వార్తలను చైనా శుక్రవారం తోసిపుచ్చింది. ఈ-కామర్స్లో గుత్తాధిపత్య నిబంధనలను అమలు చేస్తున్నందుకు ఆలీబాబాపై చైనా మార్కెట్ల నియంత్రణ సంస్థ భారీగా 975 మిలియన్ల మేరకు జరిమానా విధించాలని ప్రణాళిక రూపొందించినట్లు తమకు సమాచారం అందిందని వాల్స్ట్రీట్ జర్నల్ గురువారం ఓ వార్తాకథనం ప్రచురించింది. ఈ కథనాన్ని చైనా ఖండించింది.
అయితే, ఈ-కామర్స్ దిగ్గజం ఆలీబాబా మినహా టెన్సెంట్, బైదు, బైట్డ్యాన్స్తోపాటు 12 టెక్ సంస్థలపై చైనా మార్కెట్ల నియంత్రణ సంస్థ కొరడా ఝులిపించినట్లు తెలుస్తున్నది. ఆయా రంగాల్లో ఇతర సంస్థలు పోటీ పడకుండా గుత్తాధిపత్య నిబంధనలు అమలు చేస్తున్నందుకు వీటిపై నామమాత్రపు జరిమానాలు విధించినట్లు చైనా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మార్కెట్ రెగ్యులేషన్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
ప్రభుత్వ అనుమతి లేకుండానే ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ యువాన్ఫుడావోలో 2018లో పెట్టుబడులు పెట్టినందుకు టెన్సెంట్పై 77 వేల డాలర్ల జరిమానా విధించారు. అలాగే 2014లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ అయినెమోను స్వాధీనం చేసుకున్నందుకు సెర్చ్ జెయింట్ బైదు సైతం చైనా ప్రభుత్వానికి 77 వేల డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. యాంటీ ట్రస్ట్ నిబంధనలను ఉల్లంఘించే సంస్థల ఆట కట్టిస్తామని చైనా ప్రభుత్వం హెచ్చరించింది.