Cheque Bounce | బ్యాంకింగ్ లావాదేవీల్లో ఈ నెల నుంచి సమూల మార్పులు తీసుకొచ్చింది ఆర్బీఐ. ప్రత్యేకించి ఇతరులకు చెక్లను జారీ చేసినప్పుడు ఖాతాదారులు తమ ఖాతాల్లో సరిపడా బ్యాలెన్స్ నిధులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్ (నాచ్) సేవలు ప్రతి రోజూ 24 గంటలు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఈ నాచ్ సేవల నిబంధనలు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో చెక్ క్లియరెన్స్ కూడా ఆదివారం జరిగే అవకాశాలు ఉన్నాయి.
సాధారణంగా పని దినాల్లో మాత్రమే చెక్ క్లియరెన్స్ అవుతుందని భావించి, చాలా మంది తమ ఖాతాల్లో సరిపడా బ్యాలెన్స్ నిధులు ఉంచడానికి ముందుకు రారు. కానీ, నాచ్ సేవలు ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లోనూ లభిస్తాయి.
కనుక చెక్ల క్లియరెన్స్ కూడా భారీ స్థాయిలో సెలవు దినాల్లో జరుగుతుంది. ఒకవేళ సదరు చెక్ క్లియరెన్స్కు వచ్చినప్పుడు బ్యాంకు ఖాతాల్లో సరిపడా నగదు లేకపోతే ఆ చెక్ బౌన్స్ అవుతుంది. చెక్ బౌన్స్ అయితే ఫైన్ లేదా జరిమాన రుసుము చెల్లించాల్సి వస్తుందని ఆర్బీఐ హెచ్చరించింది. నాచ్ సేవలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నిర్వహిస్తున్నది.
వేతనాలు, పెన్షన్లు, వడ్డీ, డివిడెండ్లు తదితర చెల్లింపుల కోసమే నాచ్ సేవలను ఎన్పీసీఐ అందుబాటులోకి తీసుకు వచ్చింది. అంతే కాదు.. ప్రజలు వాటర్, విద్యుత్, గ్యాస్, ఫోన్ బిల్లులు, రుణ వాయిదా చెల్లింపులు తదితర లావాదేవీలను నాచ్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ నగదు బదిలీ (డీబీటీ) పథకాలకు దీన్ని కేంద్రం వినియోగిస్తున్నది.