భువనేశ్వర్: ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఆందోళనలతో ఇవాళ ఒడిశా అసెంబ్లీలో రభస చోటుచేసుకుంది. ఈ ఏడాదికిగాను ఒడిశా ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరించకుండా పెండింగ్లో పెట్టడంపై ప్రతిపక్షాలు అసెంబ్లీలో ఆందోళనకు దిగాయి. ప్రతిపక్ష సభ్యులు తమతమ స్థానాలను వీడి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎవరి స్థానాల్లోకి వారు వెళ్లాలని స్పీకర్ ఎంత నచ్చజెప్పినా వారు వినిపించుకోలేదు.
అంతకుముందు బీజేపీ ఎమ్మెల్యే సుభాష్ పాణిగ్రాహి సభకు క్షమాపణ చెప్పాలని అధికార బీజేడీ సభ్యులు కూడా ఆందోళన చేశారు. గత శుక్రవారం సుభాష్ పాణిగ్రాహి ప్రభుత్వం ధాన్యం సేకరణను పెండింగ్లో పెట్టడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ సాక్షిగా శానిటైజర్ సేవించి ఆత్మహత్యాయత్నం చేశారు. దాంతో సభలో ఆత్మహత్యాయత్నం చేసి సభా మర్యాదను మంటగలిపినందున పాణిగ్రాహి క్షమాపణ చెప్పాలని బీజేడీ సభ్యులు డిమాండ్ చేశారు. అధికార, ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ ఎస్ఎన్ పాత్రో సభను వాయిదా వేశారు.