న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి వెంటాడుతున్నా ఈ ఏడాది మధ్యశ్రేణి ఐటీ కంపెనీల సీఈఓలకు తీపికబురు అందింది. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒప్పందాల నేపథ్యంలో 2020-21లో ఈ ఐటీ కంపెనీల సీఈఓలు అత్యధిక వేతన పెంపును అందుకున్నారు. ఎల్అండ్టీ ఇన్ఫోటెక్ సీఈఓ సంజయ్ జలోనాకు ఏడాదిలో వార్షిక వేతనం 29 శాతం వృద్ధి చెందింది. 2020-21లో కంపెనీ లాభాలు 27.5 శాతం పెరిగాయి. ఇక మైండ్ట్రీ సీఈఓ దేవాశిష్ ఛటర్జీ వార్షిక వేతనం గత ఆర్థిక సంవత్సరంలో 131 శాతం పెరిగి రూ 11.3 కోట్లకు ఎగబాకింది.
ఇదే సమయంలో సంస్థ ఉద్యోగుల సగటు వేతన పెంపు 10 శాతంగా ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతనంలో ఎలాంటి మార్పు లేదని కంపెనీ వార్షిక నివేదిక వెల్లడించింది. మరోవైపు 2021 ఆర్థిక సంవత్సరంలో మైండ్ట్రీ లాభాలు ఏకంగా 76 శాతం ఎగబాకి రూ 1105 కోట్లకు చేరింది. ఇక పెర్సిస్టెంట్ సిస్టమ్స్ అమెరికాకు చెందిన సందీప్ కల్రాను 153 శాతం వేతన పెంపుతో రూ 11.1 కోట్ల వేతన ప్యాకేజ్తో సంస్థ సీఈఓగా నియమించుకుంది. మరోవైపు మధ్యశ్రేణి ఐటీ కంపెనీల ఉద్యోగుల వేతనం మాత్రం సగటున పదిశాతం లోపు ఉండగా సీఈఓల వేతనాల్లో భారీ పెరుగుదల నమోదైంది.