న్యూఢిల్లీ, ఆగస్టు 12: చైనాను కాపీ కొడుతూ ప్రపంచ తదుపరి కర్మాగారంగా భారత్ ఎదగలేదని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఉత్పాదక కేంద్రంగా చైనా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ దేశాన్ని కాపీ కొట్టొద్దంటూ కాంత్ భారతీయ పరిశ్రమకు హితవు పలికారు. గ్లోబల్ లీడర్గా అవతరించాలనుకుంటే వృద్ధికి వీలున్న రంగాలపై దృష్టి పెట్టాలని సూచించారు. గురువారం వ్యాపార, పారిశ్రామిక సంఘం సీఐఐ ఈ ఏడాదికిగాను వర్చువల్గా నిర్వహించిన వార్షిక సమావేశంలో కాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతీయ ప్రైవేట్ రంగం తమకు తాము గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకోవాలన్నారు. ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, హై-ఎండ్ బ్యాటరీలు, అడ్వాన్స్డ్ సోలార్ ప్యానెల్స్పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. పునరుత్పాదక శక్తి రంగంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్కు గొప్ప కంపెనీలున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉన్నది. కరోనా వైరస్ ఉద్ధృతి దృష్ట్యా ఆయా రాష్ర్టాలు విధించిన ఆంక్షలు తొలగిపోతున్న నేపథ్యంలో జీడీపీ తిరిగి కోలుకుంటున్న సంకేతాలున్నాయి. ప్రగతి కోసం పరిశ్రమకు కావాల్సిన సహాయ, సహకారాలు అందిస్తాం. అయితే పెట్టుబడులకు పెద్దపీట వేసి ఆర్థిక వ్యవస్థకు పరిశ్రమ దన్నుగా నిలవాలి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటిదాకా దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు గతంతో పోల్చితే 37 శాతం పెరిగాయి. దేశీయ ఫారెక్స్ నిల్వలు సైతం ఈ ఏడాది జూలై నాటికి 620 బిలియన్ డాలర్లకు చేరాయి.