న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన క్యాబినెట్ను బుధవారం విస్తరించారు. తెలంగాణలో సికింద్రాబాద్ నుంచి తొలిసారి లోక్సభకు ఎన్నికైన జీ కిషన్ రెడ్డికి ప్రమోషన్ లభించింది. 2019 ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించిన తర్వాత మోదీ తన క్యాబినెట్లోకి కిషన్ రెడ్డిని తీసుకున్నారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు సహాయకుడిగా సహాయ మంత్రిత్వశాఖను కిషన్ రెడ్డికి అప్పగించారు. నాటి నుంచి విధుల నిర్వహణలో కీలకంగా వ్యవహరించి.. మోదీ, అమిత్ షా మన్ననలను పొందగలిగారు.
2019 లోక్సభ ఎన్నికలకు ముందు 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంబర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కిషన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. తొలుత 2004లో టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా హిమాయత్ నగర్ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
2009 ఎన్నికల్లో నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించడంతో అంబర్పేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో తెలంగాణ ఆవిర్భావానికి ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధించారు.
కేంద్ర క్యాబినెట్ మంత్రి హోదా లభించిన తొలి తెలంగాణ నేత కిషన్ రెడ్డి కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది. కిషన్ రెడ్డికి తొలి నుంచి ఆరెస్సెస్ నేపథ్యం ఉంది.
1977లో జనతా పార్టీలో యువ నేతగా కిషన్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1980లో బీజేపీ ఆవిర్భవించిన తర్వాత పూర్తికాలం కార్యకర్తగా పని చేశారు. 1982-83 మధ్య ఏపీ బీజేవైఎం కోశాధికారిగా పని చేశారు. 1983-84లో బీజేవైఎం ఏపీ కార్యదర్శిగా, 1986-90 మధ్య అధ్యక్షుడిగా పని చేశారు.
బీజేవైఎంలో జాతీయ కార్యదర్శి, ఉపాధ్యక్ష హోదాల్లో పని చేశారు. 2001–02లో బీజేపీ ఏపీ అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2004లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదే ఏడాది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి హిమాయత్ నగర్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
2004-14 వరకు ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో బీజేపీఎల్పీ నేతగా వ్యవహరించారు. బండారు దత్తాత్రేయ స్థానంలో ఉమ్మడి ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.