Gas Subsidy | వంట గ్యాస్ సబ్సిడీ, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కేంద్రం దృష్టి సారించింది. అర్హులు.. అవసరమైన వారికి మాత్రమే వంట గ్యాస్ సబ్సిడీ విధానాన్ని కొనసాగించాలని కేంద్రం భావిస్తున్నట్లు అధికార వర్గాల కథనం. ప్రస్తుతం అందరికీ 12 సిలిండర్లు ఉచితంగా అందచేస్తున్నది. ప్రారంభంలో సబ్సిడీని యూజర్ల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది కేంద్రం.. తర్వాత క్రమంగా ధర పెంచేయడంతో సబ్సిడీ బాగా తగ్గిపోయింది.
ఇక అవసరమైన వారికే గ్యాస్ సబ్సిడీ ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం.. ఇందుకు మార్గదర్శకాలు.. విధి విధానాలను ఖరారు చేసే పనిలో పడినట్లు తెలుస్తున్నది. రోజువారీగా పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరల తగ్గింపుపై కేంద్ర ఆర్థికశాఖ, పెట్రోలియం శాఖ సమాలోచనలు జరుపుతున్నాయని సమాచారం.
పెట్రోల్, డీజిల్ ధరలను ఎలా తగ్గించాలన్న విషయమై ఆర్థికశాఖ అధికారులతో చమురుశాఖ అధికారులు చర్చించినట్లు సమాచారం. ప్రజలకు కొంత రిలీఫ్ కల్పించాలని యోచిస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారీగా ఉన్న సుంకాల తగ్గింపుపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని చమురు మంత్రిత్వశాఖ భావిస్తున్నది. అదే దీనిపై తుది నిర్ణయాధికారం ఆర్థికశాఖకే వదిలేసినట్లు తెలియవచ్చింది.
ఉమ్మడి జాబితాలో ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తప్పనిసరిగా పెట్రోల్, డీజిల్ తగ్గించాల్సిందేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు ముడి చమురు ఉత్పత్తి చేస్తున్న దేశాలతో ధరలు తగ్గించడానికి తీవ్రంగా కృషి చేయాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే మూడు నెలలు బ్యారెల్ ముడి చమురు ధర 70 డాలర్ల లోపే ఉండేలా చూడాలని కోరతారని సమాచారం. అత్యంత జాగ్రత్తతో కూడిన చర్యలు చేపట్టాని నిర్ణయానికి వచ్చారని వినికిడి.
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయికి పెరిగిపోవడంతోపాటు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.84 పలుకుతుంటే, డీజిల్ లీటర్ ధర రూ.94.57గా ఉంది. విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్ ఆర్ జెట్ ఫ్యూయల్) ధరతో పోలిస్తే సామాన్యులు వాడే పెట్రోల్ ధర 33 శాతానికి పైగా ఎక్కువగా ఉంది.
ఢిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.79,020.16 అంటే లీటర్ పెట్రోల్ ధర రూ.79. జీఎస్టీ పరిధిలోకి తేవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఇక దేశీయంగా వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు 90 రోజుల్లోపు అవసరాలకే ఉపయోగపడతాయి. ఆ నిల్వలను అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుందని అధికార వర్గాలు అంటున్నాయి.
కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత యశ్వంత్ సిన్హా స్పందిస్తూ 2014 నాటి ధరలతో ప్రస్తుత ముడి చమురు ధరలను పోల్చలేమని తేల్చి చెప్పారు. రోజువారీగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్ ధరలు ఏమాత్రం న్యాయ సమ్మతం కాదన్నారు.
2014లో పెట్రోల్ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు, ఇతర పన్నుల ద్వారా రూ.75 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వస్తే ఈ నాడు అది రూ.3.50 లక్షల కోట్లకు చేరింది. ఇది పట్టపగలు దోపిడీ కాదా? అని యశ్వంత్ సిన్హా ప్రశ్నించారు.