న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో కేంద్ర ప్రభుత్వం బాండ్ల జారీద్వారా రూ.5.03 లక్షల కోట్లు సమీకరించనుంది. ఈ రూపంలోనే ప్రథమార్ధంలో రూ.7.02 లక్షల కోట్ల రుణాల్ని సేకరించింది. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తూ కొవిడ్ సంక్షోభంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించడానికి…ఆదాయంలో ఏర్పడే లోటును భర్తీ చేసే దిశగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద రూ.12.05 లక్షల కోట్ల రుణ సమీకరణను బడ్జెట్లో ప్రతిపాదించినట్లు పేర్కొంది. వాస్తవానికి ప్రథమార్ధంలో రూ.7.24 లక్షల కోట్ల రుణాల్ని ప్రతిపాదించగా, అంతకంటే తక్కువగానే రూ.7.02 లక్షల కోట్లు సమీకరించినట్లు ఆర్థికశాఖ వివరించింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి నిర్దేశంచిన లక్ష్యంలో మిగులు మొత్తమైన రూ.5.03 లక్షల కోట్లు ద్వితీయార్ధంలో సేకరించనున్నట్లు ప్రకటనలో తెలిపింది. 2021-22 సంవత్సరానికి ప్రభుత్వ స్థూల రుణాలు రూ.12.05 లక్షల కోట్లుకాగా, నికర రుణాలు రూ.9.37 లక్షల కోట్లుగా బడ్జెట్ అంచనాల్లో వెల్లడించారు.