హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పూర్తిగా వైదొలిగేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఆర్జీఐఏలో ఎయిర్పోర్ట్స్ అథారిటీకి (ఏఏఐ) ప్రస్తుతం 13 శాతం వాటా ఉన్నది. కేంద్రం ఇటీవల ప్రకటించిన జాతీయ ఆస్తుల నగదీకరణ ప్రణాళికలో(ఎన్ఏఎంపీ) భాగంగా ఈ వాటాను అమ్మేందుకు త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. హైదరాబాద్తోపాటు బెంగళూరు (13శాతం ), ఢిల్లీ (26 శాతం), ముంబై (26శాతం) ఎయిర్పోర్టుల్లో వాటాల్ని సైతం విక్రయించనున్నట్లు తెలిసింది. ఈ ప్రక్రియను హైదరాబాద్, బెంగళూరు నుంచే మొదలు పెడుతున్నట్టు సమాచారం. రెండో దశలో ఢిల్లీ, ముంబైల్లోని వాటాను అమ్మేయనున్నారు. ఇప్పటికే పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలో ఉన్న 13 ఎయిర్పోర్టులను అమ్మేందుకు ఇటీవలే ఏఏఐ ఆమోదం తెలిపింది.