న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరత వెంటాడుతుండటంపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియ స్పందించారు. రాబోయే రోజుల్లో వ్యాక్సిన్ల కొరత ఉండదని, మరో రెండు నెలల్లో భారీ సంఖ్యంలో కరోనా వైరస్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కరోనా మహమ్మారికి సంబంధించిన అంశాలపై మెదాంత చైర్మన్ డాక్టర్ నరేష్ ట్రెహన్ తో ఆయన సంప్రదింపులు జరిపారు. విదేశాల నుంచి కూడా భారత్ కు కరోనా వ్యాక్సిన్లు రానున్నాయని ఎయిమ్స్ చీఫ్ వెల్లడించారు.
పలు వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఉత్పాదక ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నాయని చెప్పారు. సీనియర్ సిటిజన్లు, పలు వ్యాధులతో బాధపడే వారు ముందుగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. పెద్ద వయసు వారు, పలు వ్యాధులతో బాధపడే వారిలో కొవిడ్-19 సోకితే మరణాల ముప్పు అధికంగా ఉంటుందని వీరందరికీ సత్వరమే వ్యాక్సిన్ అందించేలా మనం ఏర్పాట్లు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. రెండు, మూడు రోజుల్లో లేకుంటే ఓ నెలలో దేశ జనాభా అంతటికీ వ్యాక్సిన్ ఇవ్వడం సాద్యం కాబోదని స్పష్టం చేశారు.