హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): కూరగాయలు, పండ్లకు పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా రాష్ట్రంలో ఉద్యాన పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చురుకుగా చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఉద్యాన పంటలపై పరిశోధనలు చేసేందుకు, రైతులకు అవగాహన కల్పించేందుకు రెండు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ శివారులోని జీడిమెట్లలో తొలి సీవోఈని ఏర్పాటు చేయగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని ములుగు వద్ద మరో సీవోఈని ఏర్పాటు చేసింది.
ఈ రెండు సీవోఈ ల్లోనూ పండ్లు, కూరగాయలు, పూల రకాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ములుగు ప్రదర్శన క్షేత్రంలో అత్యాధునిక సాంకేతిక సేద్య పద్ధతులను ప్రభుత్వం రైతులకు పరిచయం చేస్తున్నది. సూక్ష్మ సేద్యం, యాంత్రీకరణ, నీటి నిల్వ, నీటి సంరక్షణ, కొమ్మల కత్తిరింపులు, ఎగుమతి ప్రమాణాలు కలిగిన పండ్లను పండించటంలో నూతన యాజమాన్య పద్ధతులను అమలు చేస్తున్నారు. తెలంగాణ భూములు, వాతావరణానికి అనువైన, చీడపీడలను తట్టుకుని అధిక దిగుబడులు, అధిక ఆదాయాన్ని ఇచ్చే పలు వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు.
వీటితో పాటు 5 ఎకరాల్లో షేడ్ నెట్ పందిళ్ల కింద శ్రీగంధం మొకల నర్సరీని నెలకొల్పారు. ముఖ్యంగా సంవత్సరానికి 80 లక్షల కూరగాయల నారును ఉత్పత్తి చేసే సామర్థ్యంగల ప్లగ్ టైప్ నర్సరీని ఈ కేంద్రంలో ఏర్పాటు చేయడం గమనార్హం. టమాట, వంకాయ, మిరప, క్యాబేజీ, కాలిఫ్లవర్, కాప్సికం మొదలైన కాయగూరల నారు ఇకడ పెంచి, రైతులకు అందిస్తున్నారు. ఇక మేడ్చల్ మలాజిగిరి జిల్లా జీడిమెట్లలో గల సీవోఈలో 30 ఎకరాల విస్తీర్ణంలో 11 ప్రధాన పండ్లకు సంబంధించిన 52 రకాలకు చెందిన 17,915 మొకలను పెంచుతున్నారు. అగ్రిఫారెస్ట్రీకి సంబందించిన 5 జాతులకు చెందిన 14,747 మొకలు నాటారు.
ములుగు, జీడిమెట్ల సీవోఈల ద్వారా మన భూములు, వాతావరణానికి అనుకూలమైన పండ్లు, కూరగాయల కొత్త వంగడాలపై పరిశోధనలు నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ప్రజలు వినియోగిస్తున్న పలు రకాల పండ్లు, కూరగాయలన్నీ కూడా స్థానికంగా సాగు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ రెండు సీవోఈల ద్వారా రైతులకు నాణ్యమైన పండ్ల మొక్కలను, కూరగాయల నారు అందిస్తున్నాం. దీంతో పాటు అధునాతన పద్ధతిలో సాగుపైనా శిక్షణ ఇస్తున్నాం. ఈ కార్యక్రమాలకు రైతుల నుంచి మంచి ఆదరణ ఉంది.
-వెంకట్రామిరెడ్డి, డైరెక్టర్, ఉద్యానశాఖ