న్యూఢిల్లీ, మార్చి 15: దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత చలామణిలోకి తీసుకొచ్చిన రూ.2 వేల నోట్లు గత రెండేండ్ల నుంచి ముద్రణకు నోచుకోలేదు. అంతేకాకుండా ప్రస్తుతం వీటి సంఖ్య కూడా గణనీయంగా తగ్గింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ సోమవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2018 మార్చి 30 నాటికి 336.2 కోట్ల రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయని, దేశంలోని మొత్తం కరెన్సీ నోట్ల సంఖ్యలో వీటి వాటా 3.27 శాతమని వివరించారు. మొత్తం కరెన్సీ నోట్ల విలువలో వీటి వాటా 37.26 శాతానికి సమానమన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26 నాటికి 249.9 కోట్ల రూ.2 వేల నోట్లు చలామణిలో ఉన్నాయని, మొత్తం కరెన్సీ నోట్ల సంఖ్యలో వీటి వాటా 2.01 శాతానికి, విలువలో 17.78 శాతానికి సమానమని వివరించారు. 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో రూ.2 వేల ముద్రణకు ఎలాంటి ఆర్డర్లు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. 2016-17 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 354.30 కోట్ల రూ.2 వేల నోట్లను ముద్రించినట్లు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) 2019లో వెల్లడించింది. కానీ 2017-18లో ప్రభుత్వం 11.15 కోట్ల రూ.2 వేల నోట్లను మాత్రమే ముద్రించింది. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరం (2018-19)లో వీటి ముద్రణను కేవలం 4.67 కోట్లకే పరిమితం చేసిన కేంద్ర ప్రభుత్వం.. 2019 ఏప్రిల్ నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణను పూర్తిగా నిలిపివేసింది.
దేశంలో ఇంధన ధరలు విపరీతంగా పెరగడంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మరోసారి స్పందించారు. ప్రస్తుతానికి ముడి చమురుతోపాటు పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనం (ఏటీఎఫ్), వంట గ్యాస్ను వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ లేదన్నారు. వీటిపై ఇప్పటివరకు జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి ప్రతిపాదన చేయలేదని సోమవారం లోక్సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆమె స్పష్టం చేశారు. పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై సరైన సమయంలో జీఎస్టీ కౌన్సిల్ పరిశీలన జరిపే అవకాశం ఉన్నదన్నారు. ఏడాది క్రితం లీటర్ పెట్రోల్పై రూ.19.98గా ఉన్న ఎక్సైజ్ సుంకం ఇప్పుడు రూ.32.9కి పెరిగిందని, అలాగే డీజిల్పై ఎక్సైజ్ సుంకం రూ.15.85 నుంచి రూ.31.8కి ఎగబాకిందని మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.