కోల్కతా, డిసెంబర్ 2: సిమెంట్ ధరలకు రెక్కలు తొడగనున్నాయి. దేశీయ రిటైల్ మార్కెట్లో బస్తా ధర మరోసారి రూ.15-20 పెరుగవచ్చని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ గురువారం అంచనా వేసింది. ఈ క్రమంలోనే రాబోయే కొద్ది నెలల్లో ఆల్-టైం హైకి చేరవచ్చన్నది. పెరిగిన తయారీ ఖర్చుల దృష్ట్యా ధరల పెంపు సిమెంట్ సంస్థలకు అనివార్యమవుతున్నదని తాజా నివేదికలో వివరించింది. బొగ్గు, డీజిల్ ధరల భారం పరిశ్రమపై అధికమైందని పేర్కొన్నది. ఈ కారణాల వల్లే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) సిమెంట్ కంపెనీల ఈబీఐటీఏ టన్నుకు రూ.100-150 తగ్గవచ్చని తెలిపింది. దిగుమతి బొగ్గు ధర గతేడాదితో పోల్చితే ఈ ప్రథమార్ధం (జనవరి-జూన్)లో ఏకంగా 120 శాతానికిపైగా ఎగబాకింది. పెట్కోక్ ధరలు సైతం 80 శాతం ఎగిశాయి. దీనివల్ల టన్ను సిమెంట్ ఉత్పత్తిపై విద్యుత్తు, ఇంధన ధరల భారం రూ.350-400 పెరగవచ్చని క్రిసిల్ చెప్పింది. నిరుడుతో చూస్తే ఇది దాదాపు 40 శాతం అధికం కావడం గమనార్హం.
పెరిగే సిమెంట్ ధరలు నిర్మాణ రంగంపై మరింత భారాన్ని మోపనున్నాయి. గృహ రుణాలు అందుబాటు ధరల్లో ఉన్నా.. కరోనా పరిస్థితుల ప్రభావంతో రియల్ ఎస్టేట్ కుదేలైన సంగతి విదితమే. దీంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రియల్ మార్కెట్కు పెరిగే సిమెంట్ ధరలు దెబ్బేనని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిజానికి సిమెంట్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరం 11-13 శాతం పెరుగుతాయని అంచనా. అయితే గత ఆర్థిక సంవత్సరం కరోనా లాక్డౌన్ల నేపథ్యంలో పరిశ్రమ దీన్ని వృద్ధిగా భావించట్లేదు. ఈ క్రమంలో మౌలిక, హౌజింగ్, పారిశ్రామిక రంగాల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తేగానీ తమకు లాభాలు వచ్చే పరిస్థితి లేదని సిమెంట్ సంస్థలు చెప్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనలూ ఇప్పుడు అటు సిమెంట్, ఇటు రియల్ ఎస్టేట్ రంగాలను వెంటాడుతున్నాయి.
సిమెంట్ ధరలు దక్షిణాదిలోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్లో దక్షిణాది రాష్ర్టాల్లో అత్యధికంగా బస్తా ధర రూ.54 పెరిగింది. ఇదే సమయంలో సెంట్రల్
రీజియన్లో రూ.20 పెరిగితే, ఉత్తరాది రాష్ర్టాల్లో రూ.12, పశ్చిమాది ప్రాంతాల్లో రూ.10, తూర్పు నగరాల్లో రూ.5 మేర పెరిగింది. ఆయా కంపెనీలనుబట్టి ప్రస్తుతం మార్కెట్లో బస్తా ధర రూ.350 నుంచి రూ.400 పలుకుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ పెరిగే ధరలు సిమెంట్ బస్తా విలువను మునుపెన్నడూ లేని రికార్డు స్థాయికి చేర్చగలవన్న అంచనాలు వినిపిస్తున్నాయి.