న్యూఢిల్లీ: చైనాకు చెందిన అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్కు చెందిన ఆన్లైన్ కిరాణా సామాగ్రి విక్రేత బిగ్బాస్కెట్ ఇక టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధీనంలోకి రానుంది. ఈ డీల్కు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) గురువారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కొవిడ్ కారణంగా ఆహారం, కిరాణా ఇ-కామర్స్ అమ్మకాలు భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో టాటా సన్స్ ఈ సంస్థను చేజిక్కించుకోవడం విశేషం. దీంతో ఇక నుంచి అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు పోటీగా టాటా సన్స్ మారనుంది.
బిగ్ బాస్కెట్ బిజినెస్-టు-బిజినెస్ సేల్స్ను నడిపే సంస్థలో 64.3 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు సీసీఐకి చేసిన దరఖాస్తులో టాటా సన్స్ యూనిట్ అయిన టాటా డిజిటల్ లిమిటెడ్ తెలిపింది. ఇ-కిరాణా బిజినెస్లోకి టాటాల ప్రవేశంతో ప్రత్యర్థులు దీనిపై మరింత భారీ ఖర్చు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గతేడాది కొవిడ్ లాక్డౌన్ తర్వాత ఇ-కామర్స్ సంస్థలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ప్రజలు చాలా వరకు ఇళ్లకే పరిమితం కావడంతో ఆహారం, కిరాణా సామాను కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం ప్రారంభించారు. బిగ్బాస్కెట్ కూడా గతేడాది లాక్డౌన్లో 16 రోజుల వ్యవధిలోనే 12,300 మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నట్లు ఆ సంస్థ సీఈవో హరి మీనన్ చెప్పారు.