కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి, అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పార్థ చటర్జీకి సీబీఐ శుక్రవారం సమన్లు జారీ చేసింది. ఐ-కోర్ పోంజి అవినీతి కేసులో విచారణకు హాజరు కావాలని ఆదేశించినట్లు సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వచ్చే వారంలోగా కోల్కతాలోని సీబీఐ కార్యాయాలనికి రావాలని సీబీఐ ఆదేశించినట్టు సమాచారం.
ఐ-కోర్ కంపెనీ ఏర్పాటు చేసిన పలు కార్యాక్రమాలకు పార్థ చటర్జీ హాజరైనట్టు ఆరోపణలున్నాయి. ఎక్కువ మొత్తంలో రిటర్నులు వస్తాయంటూ పెట్టుబడిదారుల నుంచి పెద్ద ఎత్తున సొమ్ములు వసూలు చేసి మోసగించారని ఐ-కోర్ మీద ఆరోపణలు ఉన్నాయి.మరోవైపు తనకు సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని రాష్ట్ర మంత్రి పార్థ చటర్జీ పేర్కొన్నారు.
‘నన్నువిచారణకు పిలిస్తే, తప్పకుండా వెళ్తాను. ఓ మంత్రిగా నేను ఏ కార్యక్రమంలోనైనా పాల్గొనవచ్చు. రాజకీయాల్లోకి చేరేందుకు నేను ఎంతో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలిపెట్టా వచ్చానన్న సంగతి గుర్తుచేసుకుంటే మంచిది. ధనం మీద నాకు ఎలాంటి వ్యామోహం లేదు’ అని పేర్కొన్నారు. శారద, రోజ్వ్యాలీ చిట్ ఫండ్ కంపెనీల మాదిరిగానే.. ఐ-కోర్ కూడా పలు తప్పుడు పథకాలు ప్రచారం చేసి ఇన్వెస్టర్ల నుంచి భారీగా డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.