న్యూఢిల్లీ, జూన్ 9: యెస్ బ్యాంక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ.. దేశవ్యాప్తంగా సోదాలు నిర్వహించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో 14చోట్ల తనిఖీలు చేసిన అధికారులు.. సికింద్రాబాద్తోపాటు లక్నో, కోల్కతా నగరాల్లోనూ దాడులు జరిపారు. 2017-19లో యెస్ బ్యాంక్ నుంచి రూ.466.15 కోట్ల నిధులను మళ్లించారన్న ఆరోపణలపై ఓస్టర్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఓబీపీఎల్) డైరెక్టర్లు రఘుబిర్ కుమార్ శర్మ, రాజేంద్ర కుమార్ మంగళ్, తాప్సీ మహజన్, అవంతా గ్రూప్ ప్రమోటర్ గౌతమ్ తప్పర్, అవంతా రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, ఝబువా పవర్ లిమిటెడ్కు చెందిన మరికొందరు ఉద్యోగులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆశిష్ వినోద్ జోషి ఫిర్యాదుతో గత నెల 27న సీబీఐ నేరపూరిత కుట్ర, మోసం, ఫోర్జరీ తదితర సెక్షన్ల కింద కేసు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ సోదాలు జరిగాయి. అవంతా గ్రూప్ అనుబంధ సంస్థే ఓబీపీఎల్ అని, ఆయా కంపెనీలు రుణాల ఎగవేతకు పాల్పడినట్లు సీబీఐ తెలిపింది. కాగా, యెస్ బ్యాంక్లో ప్రజా ధనాన్ని పక్కదారి పట్టించారన్న మరో కేసులోనూ తప్పర్ విచారణను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో బ్యాంక్ మాజీ చీఫ్ రాణా కపూర్ కూడా నిందితుడిగా ఉన్నారు.