భారీగా లాభపడిన సూచీలు
ముంబై, మే 5: కరోనాతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి రిజర్వుబ్యాంక్ తీసుకున్న చర్యలు స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చాయి. వరుసగా మూడు రోజులుగా నష్టాలబాట పట్టిన సూచీలకు సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా లాభాలబాట పట్టాయి. ప్రారంభం నుంచి లాభాల్లో కళకళలాడిన సూచీలకు బ్యాంకింగ్,ఫార్మా, ఐటీ రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో దూసుకుపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 424.04 పాయింట్లు ఎగబాకి 48,677.55 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ కూడా 121.34 పాయింట్లు అందుకొని 14,617.85 వద్ద నిలిచింది. వ్యక్తిగత, చిన్న స్థాయి పెట్టుబడిదారులకు ఊరట కల్పించేలా సెంట్రల్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయం సూచీల్లో జోష్ పెంచింది. సన్ఫార్మా 5.94 శాతం పెరిగి టాప్ గెయినర్గా నిలిచింది. దీంతోపాటు కొటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, టైటాన్,టీసీఎస్లు కూడా లాభాల్లో ముగిశాయి. కానీ, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్యూఎల్లు మాత్రం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే హెల్త్కేర్, బ్యాంకింగ్, మెటల్, ఐటీ రంగ సూచీలు మూడు శాతానికి పైగా లాభపడగా..రియల్టీ రంగ సూచీలు మదుపరులను ఆకట్టుకోలేక పోయాయి.