ముంబై, నవంబర్ 25: అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత మరోసారి బయటపడింది. వివిధ అభివృద్ధి పనుల కోసం కేటాయించిన వార్షిక మూలధన వ్యయ నిధుల వినియోగంలో తెలంగాణే అగ్రగామిగా ఉన్నట్లు ఓ తాజా నివేదికలో తేలింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో రాష్ర్టాలు చేసిన మూలధన వ్యయం పట్టికలో తెలంగాణ ప్రభుత్వం టాప్లో నిలిచినట్లు కేర్ రేటింగ్స్ తెలిపింది. కేరళ కూడా ముందున్నట్లు పేర్కొన్నది. ఈ ఆర్థిక సంవత్సరం కోసం కేటాయించిన రూ.28,518 కోట్ల మూలధన వ్యయం నిధుల్లో తొలి ఆరు నెలల్లో రూ.14,814 కోట్లు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసేనట్లు కేర్ రేటింగ్స్ వెల్లడించింది. ఇది 51.9 శాతంతో సమానం.
కేంద్రానిదీ అంతంతే..
మూలధన వ్యయంలో కేంద్ర ప్రభుత్వం సైతం వెనుకబడే ఉన్నది. రూ.5.13 లక్షల కోట్లకుగాను రూ.2.09 లక్షల కోట్లకే పరిమితమైంది. అంటే 41 శాతం దాటలేదు. గత ఆర్థిక సంవత్సరం ఇది 56 శాతంగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 54 శాతంగా ఉండటం విశేషం. కాగా, దేశంలోని 24 రాష్ర్టాలు ఈ ఆర్థిక సంవత్సరం కోసం రూ.5.76 లక్షల కోట్ల మూలధన వ్యయం నిధులను కేటాయించుకున్నాయి. అయినప్పటికీ ప్రథమార్ధం ఖర్చు రూ.1,63,868 కోట్ల వద్దే ఉన్నట్లు కేర్ రేటింగ్స్ తెలియజేసింది. ఇది 28.4 శాతంతో సమానం.