న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ను కట్టడి చేయడానికి వివిధ రాష్ట్రాలు లాక్డౌన్లు, ప్రజల కదలికలపై ఆంక్షలు విధించడంతో ఏప్రిల్ నెలలో ఆటోమొబైల్ పరిశ్రమ విషమ పరీక్షనెదుర్కొంది.
సాధారణ పరిస్థితులు నెలకొంటుండటంతో మే నెలలో కాస్త పురోగతి నమోదైంది. 2021 ఏప్రిల్తో పోలిస్తే మే నెలలో సేల్స్ గణనీయంగా పెరిగాయి. ఇదే ట్రెండ్ జూన్ నెలలోనూ కొనసాగింది. వివిధ కార్ల తయారీ సంస్థల విక్రయాల్లో పాజిటివ్ గ్రోత్ నమోదైంది.
దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (ఎంఎస్ఐ) సేల్స్ 2020 జూన్ నెలతో పోలిస్తే 142.38 శాతం గ్రోత్ రికార్డైంది. గతేడాది జూన్లో కేవలం 51,274 యూనిట్లు అమ్ముడైతే ఈ ఏడాది 1,24,280 యూనిట్లకు పెరిగింది.
మారుతి ఆల్టో, ఎస్-ప్రెస్సో మోడల్ కార్ల విక్రయాలు 10,458 నుంచి 17,439 యూనిట్లకు పెరిగాయి.. ఈ రెండు మోడల్ కార్ల సేల్స్ 66.75 శాతం పెరిగాయి.
ఇక కంపాక్ట్ మోడల్ కార్లలో డిజైర్, స్విఫ్ట్, సెలెరియో, బాలెనో కార్ల విక్రయాలు 26,696 యూనిట్ల నుంచి 68,849 యూనిట్లకు చేరాయి. యుటిలిటీ వెహికల్స్ సేల్స్ కూడా గణనీయంగా వ్రుద్ధి చెందాయి. ఎర్టిగా, ఎక్స్ఎల్-6, విటారా బ్రెజా, ఎస్-క్రాస్ మోడల్ కార్లు గతేడాది 9,764 యూనిట్లు అమ్ముడైతే ఈ ఏడాది 188.5 శాతం పెరిగాయి.
మారుతి ప్రత్యర్థిగా భావిస్తున్న హ్యుండాయ్ కార్ల సేల్స్లోనూ 89.9 శాతం వ్రుద్ధి నమోదైంది. గతేడాది 21,320 యూనిట్లు విక్రయించిన హ్యుండాయ్.. గత నెలలో 40,496 కార్లు విక్రయించింది.
హ్యుండాయ్ మోటార్ ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ కస్టమర్ల సెంటిమెంట్స్లో పురోగతి నమోదైందన్నారు.
కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ఇన్నోవేటివ్ అండ్ వరల్డ్ క్లాస్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అందుబాటులోకి తెచ్చేందుకు కట్టుబడి ఉన్నామని తరుణ్ గార్గ్ చెప్పారు.
ఇటీవలే విపణిలో ఆవిష్కరించిన ఆల్కాజార్ మోడల్ కార్లకు కస్టమర్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నదన్నారు. ఇటీవలే భారత్లో కోటి కార్లను విక్రయించిన సంస్థగా నిలిచిందన్నారు.
దేశీయ కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 109 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. 2020 జూన్లో కేవలం 8,075 యూనిట్లు అమ్ముడైతే, గత నెలలో 16,913 కార్లు విక్రయించినట్లు తెలిపింది.
మహీంద్రా అండ్ మహీంద్రా ట్రాక్టర్ల సేల్స్ 36,544 యూనిట్ల నుంచి 48,222 యూనిట్లకు వ్రుద్ధి చెందాయి.
టాటా మోటార్స్ కార్ల సేల్స్లో 111 శాతం గ్రోత్ రికార్డైంది. గతేడాది జూన్లో 11,419 కార్లు అమ్ముడు కాగా, గత నెలలో 24,110 యూనిట్లు సేల్ అయ్యాయి. గత నెలలో టాటా మోటార్స్ నెక్సన్ ఈవీ మోడల్ ఎక్కువగా అమ్ముడైన బెస్ట్ మోడల్గా నిలిచింది. గత నెలలో 650 యూనిట్లు సేల్ కాగా, ఇప్పటి వరకు 4,500 ఎలక్ట్రిక్ కార్లు అమ్ముడయ్యాయి.
దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా గత నెల కార్ల విక్రయాల్లో 36 శాతం గ్రోత్ నమోదు చేసుకున్నది. మే నెలతో పోలిస్తే 11,050 యూనిట్ల నుంచి 15,015 యూనిట్లకు పెరిగింది. సెల్టోస్ 8,549, సొనెల్ 5963, కార్నివాల్ 503 యూనిట్లు అమ్ముడయ్యాయి.
ఎంజీ మోటార్స్ సేల్స్లో 76.83 శాతం వ్రుద్ధి రికార్డైంది. 2020జూన్లో 2012 యూనిట్లు విక్రయించగా, ఈ ఏడాది 3558 కార్లు సేల్ అయ్యాయి.
టూ వీలర్స్ మేజర్ బజాజ్ ఆటో సేల్స్ 22 శాతం పెరిగాయి. 2020తో పోలిస్తే గత నెలలో 2,55,122 బైక్స్ అండ్ స్కూటర్స్ నుంచి 3,10,578 యూనిట్లకు చేరాయి. వీటిల్లో విదేశాలకు ఎగుమతి చేసిన బైక్స్ కూడా ఉన్నాయి.
మరో ద్విచక్ర వాహనాల దిగ్గజం హీరో మోటో కార్ప్స్ దేశీయ సేల్స్ రెండు శాతం లోపే పెరిగాయి.
గతేడాది జూన్లో 4,30,889 యూనిట్లు విక్రయించింది హీరో మోటో కార్ప్స్. ఈ నెల 4,38,514 యూనిట్లకే పరిమితమైంది.