‘ఉప్పెన’చిత్రంతో కుర్రకారు గుండెల్లో వలపు బాణాల్ని సంధించింది కృతిశెట్టి. చూడముచ్చటైన రూపం, చక్కటి అభినయంతో యువతరానికి చేరువైంది. ప్రస్తుతం ఈ కన్నడ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగులో ఇప్పటికే నాని, రామ్ సరసన కథానాయికగా నటిస్తోన్న ఈ సొగసరి మరో బంపరాఫర్ దక్కించుకుంది. నితిన్తో జోడీగా కృతిశెట్టి ఓ సినిమాలో నటించనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే… నూతన దర్శకుడు శేఖర్ నిర్దేశకత్వంలో నితిన్ ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. త్వరలో షూటింగ్ మొదలుకానున్నట్లు సమాచారం. ఇందులో కృతిశెట్టిని కథానాయికగా ఎంపిక చేశారని తెలిసింది. అరంగేట్రం చేసిన అనతికాలంలోనే ఈ అమ్మడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా దూసుకుపోతోంది.