CAIT on Niti Ayogh | కొత్తగా రూపొందించిన ఈ-కామర్స్ నిబంధనల ముసాయిదా విషయమై నీతి ఆయోగ్ తీరును అఖి భారత వ్యాపారుల సమాఖ్య (కెయిట్) తప్పుబట్టింది. విదేశీ ఈ-కామర్స్ దిగ్గజాల ఒత్తిళ్లకు తలొగ్గి ముసాయిదా ఈ-కామర్స్ నిబంధనలను రూపకల్పనలో నీతి ఆయోగ్ జోక్యం చేసుకున్నదని కెయిట్ విమర్శలు గుప్పించింది. ఇటీవల కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ.. ఈ-కామర్స్ నిబంధనలను రూపొందించింది.
ఏడేండ్లుగా దేశంలోని 8 కోట్ల మంది వ్యాపారులకు మద్దతుగా నీతి ఆయోగ్ చేసిందేమీ లేదని కెయిట్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మండిపడ్డారు. రిటైల్ రంగంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని పేర్కొన్నారు. కానీ నీతి ఆయోగ్ మధ్యలో జోక్యం చేసుకుని మొత్తం ప్రక్రియను పక్కదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
గ్లోబల్ ఈ-కామర్స్ దిగ్గజాలు బహిరంగంగా ఎఫ్డీఐ పాలసీ నిబంధనలను ఉల్లంఘించి దేశంలోని రిటైల్, ఈ-కామర్స్ రంగాన్నిధ్వంసం చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు నీతి ఆయోగ్ వ్యవహరించిందని కెయిట్ ప్రెసిడెంట్ బీసీ భాటియా ఆరోపించారు. ఈ-కామర్స్ కంపెనీల అవకతవకలకు చరమగీతం పాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా నీతి ఆయోగ్ స్పందించడం దిగ్భ్రాంతికరం అని వ్యాఖ్యానించారు.