న్యూఢిల్లీ: క్యాడ్బరీ ఇండియా.. ఒక చాక్లెట్ కంపెనీ.. రాయితీలు పొందడానికి వాస్తవాలను తప్పుదోవ పట్టించింది. అధికారులతో కలిసి కుట్ర పన్నింది. అవినీతికి పాల్పడినందుకు క్యాడ్బరీపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. పన్ను రాయితీలను పొందడానికి 2009-11 మధ్య కాలంలో హిమాచల్ ప్రదేశ్లో రెండో యూనిట్ ఏర్పాటు చేయకున్నా.. చేశానని పత్రాలు సమర్పించింది. కొన్ని రికార్డులు తారుమారు చేసి ప్రాంతాల వారీ రాయితీలను పొందింది. తద్వారా ఫైవ్ స్టార్, జెమ్స్ చాక్లెట్స్ని తయారు చేస్తున్న క్యాడ్బరీ రూ. 241 కోట్ల మేర పన్ను లబ్ధిని పొందిందని సీబీఐ ఆరోపించింది.
హిమాచల్ప్రదేశ్లోని బడ్డీలో క్యాడ్బరీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి మరో పదేండ్లు అదనంగా సుంకాలు, పన్ను రాయితీలు పొందేలా ప్రతిపాదనలు అందించింది. ఆ తర్వాత కొత్త యూనిట్ నిర్మించకుండా, 2005 నుండి ఉన్న ఫ్యాక్టరీని కొంత విస్తరించింది. 2010 జులైలో రెండో యూనిట్ లైసెన్స్ తీసుకుంది. పన్ను మినహాయింపులు పొందడానికి విధించిన గడువు ముగిసి 4 నెలలు దాటింది. అంతేకాదు.. రెండవ యూనిట్కూ పన్నురాయితీ పొందే అర్హత లేదు. దీంతో సెంట్రల్ ఎక్సైజ్ అధికారులకు మధ్యవర్తుల ద్వారా లంచాలిచ్చి రూ.241 కోట్ల మేర పన్ను రాయితీలను పొందింది. ఈ క్రమంలో… రికార్డుల తారుమారు, లంచాల వ్యవహారం నడిచిందని సీబీఐ పేర్కొంది.