న్యూఢిల్లీ, జూలై 22:దేశంలో స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తిని పెంచేదిశగా రూ. 6,322 కోట్ల ప్రోత్సాహక పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉక్కు రంగానికి ఊతమిస్తూ ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సింటివ్ (పీఎల్ఐ) స్కీముకు గురువారం ప్రధాని నరేంద్ర మోది అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పారు. ఈ రూ. 6,322 కోట్ల విలువైన ప్రోత్సాహకాల్ని ఐదేళ్లపాటు అందిస్తామని ఠాకూర్ వివరించారు. ఈ స్కీము కారణంగా దేశంలో స్పెషాలిటీ ఉక్కు ఉత్పత్తి పెరగడంతో పాటు దిగుమతులు తగ్గుతాయని ఆయన తెలిపారు. 2023-24 నుంచి 2027-28 వరకూ అమలయ్యే ఈ పీఎల్ఐ స్కీము రూ.40,000 కోట్ల అదనపు పెట్టుబడుల్ని ఆకర్షిస్తుందని, 2.5 కోట్ల టన్నుల ఉత్పాదక సామర్థ్యం పెరుగుతుందని ఉక్కు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. ఈ స్కీము కింద స్పెషాలిటీ గ్రేడ్ స్టీల్ తయారీ కంపెనీలు&అవి పెంచిన ఉత్పత్తి విలువలో 4 నుంచి 12 శాతం వరకూ ప్రభుత్వం ప్రోత్సాహకంగా అందిస్తుంది.
పీఎల్ఐ స్కీము ద్వారా కవర్కోటెడ్/ప్లేటెట్ స్టీల్, హైస్ట్రెంత్/వేర్ రెసిస్టెంట్ స్టీల్, స్పెషాలిటీ రెయిల్స్, అల్లాయ్ స్టీల్ ఉత్పత్తులు, స్టీల్ వైర్లు, ఎలక్ట్రికల్ స్టీల్ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు లభిస్తాయి.