సింగపూర్ కంపెనీని కొన్నట్లు ప్రకటన
డీల్ విలువ రూ. 4,466 కోట్లు
న్యూఢిల్లీ, జూలై 26: దేశీ ఎడ్యుటెక్ దిగ్గజం బైజూస్ టేకోవర్ల పరంపరను కొనసాగిస్తున్నది. అమెరికా స్టార్టప్ను టేకోవర్చేసి కొద్దిరోజుల్లోనే మరో కంపెనీని చేజిక్కించుకుంది. సింగపూర్కు చెందిన గ్రేట్ లెర్నింగ్ను 600 మిలియన్ డాలర్లకు (రూ.4,466 కోట్లు) కొనుగోలు చేసినట్లు బైజూస్ సోమవారం ప్రకటించింది. ప్రొఫెషనల్, ఉన్నత విద్యా విభాగానికి చెందిన గ్రేట్ లెర్నింగ్ను పటిష్ఠపర్చేందుకు మరో 400 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు బైజూస్ తెలిపింది. అమెరికాకు చెందిన డిజిటల్ రీడింగ్ ప్లాట్ఫామ్ ఎపిక్ను 500 మిలియన్ డాలర్లకు (రూ.3,730 కోట్లు) బైజూస్ ఇటీవల కొన్న సంగతి తెలిసిందే. అమెరికా స్టార్టప్లో మరో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి చేయనున్నట్లు కూడా వెల్లడించింది. ఇక తాజాగా గ్రేట్ లెర్నింగ్ టేకోవర్ లావాదేవీ& కొంత మొత్తాన్ని నగదు రూపేణా, మరికొంత స్టాక్స్ రూపంలో ఉంటుందని బైజూస్ వివరించింది. గ్రేట్ లెర్నింగ్ వ్యవస్థాపకుడు, సీఈవో మోహన్ లఖమ్రాజు, సహవ్యవస్థాపకులు హరినాయర్, అర్జున్ నాయర్ల నేతృత్వంలోనే ఆ కంపెనీ ఇక ముందుకూడా నడుస్తుంది. బైజూస్ గతేడాది కోడింగ్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ వైట్హ్యాట్ జూనియర్ను, ఈ ఏడాది ఏప్రిల్లో ఆకాశ్ ఎడ్యుకేషనల్ను టేకోవర్ చేసింది.