గత నెల రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ సైడ్వేస్ ట్రేడ్ అవుతున్నది. గతేడాది మార్చి నెలలో నమోదైన కనిష్ఠ స్థాయి నుంచి 110 శాతానికిపైగా పెరిగిన తర్వాత స్థిరంగా కేవలం 300 పాయింట్ల రేంజ్లోనే రెండు నెలలుగా ట్రేడ్ అవుతుండడంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను కొనసాగించడమా? లేదా? అనే సందిగ్ధంలో పడిపోయారు. అసలు కొత్త ఇన్వెస్ట్మెంట్లకు ఇది సానుకూల సమయమేనా?.. ఉన్న పోర్టుఫోలియోలో లాభాలను స్వీకరించవచ్చా?.. ఒకవేళ మార్కెట్ మళ్లీ ఎగుడుదిగుడులకు లోనైతే సురక్షిత పెట్టుబడి అవశాలేమిటి?.. అనే సందేహాలకు సమాధానాలను రాబట్టేందుకు యూటీఐ మ్యూచువల్ ఫండ్ మేనేజర్ వి శ్రీవత్సతో ఇంటర్వ్యూ మీకోసం..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు, వాల్యుయేషన్లపై మీ అభిప్రాయం?
లిక్విడిటీ, దేశీయ సంస్థాగత మదుపరులు, రిటైల్ మదుపరుల కొనుగోళ్లు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను ప్రతిబింబిస్తున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్ల నుంచి మోస్తరు కొనుగోళ్లు కూడా జరుగుతుండటంతో మార్కెట్ నిలదొక్కుకోగలుగుతున్నది. దేశంలో 50 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ జరిగితే డిమాండ్ మళ్లీ గాడినపడి జీడీపీ వద్ధిబాట పట్టవచ్చు. కార్పోరేట్ రాబడుల బేస్ మారిపోతుండటంతో భారీగా పెరుగుదల నమోదయ్యే అవకాశం ఉన్నది.
మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్ల జోరు కొనసాగుతుందా?
మిడ్క్యాప్, స్మాల్క్యాప్ షేర్లు ప్రీమియం ధరల్లో ట్రేడ్ అవుతున్నాయి. లార్జ్క్యాప్ షేర్ల కన్నా అధిక వాల్యూయేషన్తో కొనసాగుతున్నాయి. అయితే గతంలో మాదిరి మరోసారి భారీ పతనం వస్తుందన్న అభిప్రాయాలతో ఏకీభవించను. కొన్ని షేర్లే పడిపోవచ్చు.
వచ్చే ఏడాది కాలంలో మెరుగైన పనితీరు కనబరిచే రంగాలు ఏమున్నాయి?
దేశీయంగా రికవరీ నిర్మాణాత్మకంగా జరిగితే.. ఫైనాన్షియల్, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ గూడ్స్, నిర్మాణ రంగాలు లాభదాయకం. కాబట్టి ఈ రంగాల్లోని ప్రముఖ కంపెనీల్లో, వృద్ధిరేటును క్రమంగా నమోదు చేస్తున్న సంస్థల్లో మదుపు చేయవచ్చు.
చిన్న మదుపరులు ఎలాంటి మదుపు వ్యూహాన్ని అవలంబించాలి?
చిన్న మదుపరులు ప్రధానంగా ఎస్ఐపీ పద్ధతిని అనుసరించాలి. క్రమం తప్పకుండా మదుపు చేయడం వల్ల దీర్ఘకాలిక లాభాలు భారీగా ఉంటాయి. కరెక్షన్లు వస్తే మరింత ఎక్కువ మొత్తాన్ని మదుపు చేయడానికే ప్రయత్నించాలి. పోర్టుఫోలియోలో, మ్యూచువల్ ఫండ్లతోపాటు, ఈక్విటీలలో డైవర్సిఫికేషన్ను అవలంబించాలి.
రిస్క్కు దూరంగా ఉండాలనుకునేవారికోసం?
వయసు, ఆదాయం, రిస్క్ ప్రొఫైల్నుబట్టి నిధుల కేటాయింపులు జరగాలి. 60 ఏండ్ల పైబడినవారు నేరుగా షేర్లను కొనవద్దు. క్యాపిటల్ ప్రొటెక్షన్ కోరు కునేవారికి హైబ్రిడ్, డెట్ ఫండ్స్తోపాటు ఎఫ్ఎంపీ, ఎస్డబ్ల్యూపీ స్కీములు ఉత్తమం.
యూటీఐ ఈక్విటీ ఫండ్లలో రాబడి ఎలా ఉన్నది?
గతేడాది కాలంలో 73.04 శాతం రాబడి ఉన్నది. మూడేండ్ల కాలంలో ఏటా 13.98 శాతం రాబడిని మదుపరులకు ఇవ్వగలిగాం.
వీ శ్రీవత్స, ఫండ్ మేనేజర్,
యూటీఐ మ్యూచువల్