న్యూఢిల్లీ, జూలై 23: ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో.. శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో అదిరేలా నమోదైంది. జొమాటో షేర్లకు మదుపర్లు బ్రహ్మరథం పట్టడంతో తొలిరోజే దాదాపు 66 శాతం విలువ ఎగబాకింది. ఇష్యూ ధర రూ.76గా ఉంటే.. ఏకంగా రూ.115తో లిస్టింగైంది. ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్సేంజ్లో గరిష్ఠంగా 81.57 శాతం ఎగిసి రూ.138ని తాకింది. చివరకు 65.59 శాతం వృద్ధితో రూ.125.85 వద్ద స్థిరపడింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్లోనూ రూ.116 వద్ద లిస్టింగ్ అవగా, ఆఖర్లో రూ.125.30గా ముగిసింది. ఇక కొనుగోళ్ల జోష్లో కంపెనీ మార్కెట్ విలువ మొదటిరోజే రూ.లక్ష కోట్ల మార్కును దాటేయగా, మార్కెట్ ముగిసే సమయానికి రూ.98,731.59 కోట్ల వద్ద ఉన్నది.