ఖైరతాబాద్, మార్చి 12: దేవాలయాలకు ధూపదీప నైవేద్యాలను అందిస్తూ బ్రాహ్మణుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, హుస్నాబాద్ ఎమ్మెల్యే వీ సతీశ్కుమార్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలకు ధూపదీప నైవేద్యం, కైంకర్యాలు అందజేస్తామని ఇచ్చిన హామీపై హర్షం వ్యక్తంచేశారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి వేదపండితులు ఆశీర్వచనాలు పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో 15 వేలకుపైగా దేవాలయాలు ఉన్నాయని, ప్రభుత్వ పథకం ద్వారా వాటికి ధూపదీప నైవేద్యాలు అందుతాయని చెప్పారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద వేద పాఠశాల ఏర్పాటుకు స్థల కేటాయింపు విషయంలో మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక అసెంబ్లీలో బిల్లు పాస్ చేయిస్తామని చెప్పినట్టు తెలిపారు. నిత్యం బ్రాహ్మణుల సంక్షేమం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు రెండు పట్టభద్ర నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డి గెలుపును బహుమతిగా అందిస్తామని పేర్కొన్నారు. వారికి మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపించుకోవాలని బ్రాహ్మణ సమాజానికి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య జంట నగరాల అధ్యక్షుడు తులసి శ్రీనివాస్, మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల రీజినల్ సెక్రటరీ వీఎస్ఎన్ శ్రీనివాస్రావు, మాజీ కార్పొరేటర్ నరేందర్ ఆచార్య, బ్రాహ్మణ సేవా వాహిని అధ్యక్షుడు శేషం రఘుకిరణాచార్యులు, సీతారామశాస్త్రి, ఆవునూరి వెంకటేశ్వర్రావు, వెంకటేశ్వరశర్మ, పతాంజలిశర్మ తదితరులు పాల్గొన్నారు.