హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): ఇంకోర్ గ్రూప్ ఇంక్యుబేషన్ వెంచర్ బోస్టన్ లివింగ్, జీఎంఆర్ హైదరాబాద్ ఏరోసిటీతో జట్టు కట్టింది. రూ.250 కోట్ల పెట్టుబడితో ఏరోసిటీ వద్ద కో-లివింగ్ ప్రాజెక్టును బోస్టన్ లివింగ్ అభివృద్ధి చేయనున్నది. ఈ మేరకు ఇరు సంస్థల మధ్య తాజాగా అవగాహన ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం జీఎంఆర్ ఏరోసిటీ 5 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని బోస్టన్ లివింగ్కు లీజుకు ఇవ్వనున్నది. ఈ ప్రాజెక్టు కింద దశలవారీగా ఇక్కడ 1,500 బెడ్స్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు ‘ద ల్యాండింగ్ బై బోస్టన్ లివింగ్’ అని పేరు పెట్టారు. ఇప్పటికే కొండాపూర్లో 500 బెడ్లతో కో-లివింగ్ సౌకర్యాన్ని ఈ సంస్థ అందిస్తున్నది. ఇది దేశంలోని అతిపెద్ద సింగిల్ లొకేషన్ కో-లివింగ్ సదుపాయాల్లో ఒకటిగా ఉండటం విశేషం.