తిమ్మాపూర్ రూరల్, ఏప్రిల్ 4: అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువపై రాజీవ్హ్రదారి బ్రిడ్జివద్ద చీకటైందంటే చాలు పురుగుల దండు విరుచుకుపడుతున్నది. ఆరు నుంచి 10 గంటల దాకా గుంపులు గుంపులుగా వస్తున్నాయి. లైట్ల వెలుగులకు ఆకర్షితమవుతూ ద్విచక్రవాహనదారుల కండ్లల్లోకి వెళ్తున్నాయి. కార్ల అద్దాలకు కుప్ప లు కుప్పలుగా అతుక్కుంటున్నాయి. దీంతో రోడ్డు కనిపించకపోవడంతో వాహనదారులు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు. శనివారం ఒక్కరోజే పదుల సంఖ్యలో కిందపడి గాయాలపాలవ్వడం చూస్తుంటే పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. కాగా, శనివారం జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్, ఎస్ఐ కృష్ణారెడ్డి, ఏవో సురేందర్, కార్పొరేటర్ సల్ల శారదారవీందర్, శాస్త్రవేత్తలు కాకతీయ కాలువ వద్దకు వెళ్లి పురుగుల నమూనాలను సేకరించి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కీటకశాఖ అధిపతికి పంపించారు. ఈ పురుగులను ‘క్యాడిష్ ఫ్లై’స్ అంటారని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కీటక శాస్త్ర విభాగాధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ రహమాన్ ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు ఏవో సురేందర్ వివరాలు వెల్లడించారు. ఈ పురుగులు నీటిలో లార్వా రూపం లో ఉంటాయని, పుష్పాదక దశలో ఒడ్డునకు వచ్చిన తర్వాత రెక్కల పురుగుగా మారి లైట్ల వెలుగులకు ఆకర్షితమవుతాయని పేర్కొన్నారు. వీటి జీవితకాలం వారం ఉంటుందని చెప్పారు.
నివారణకు చర్యలు
కాలువపై పురుగులు వాహనదారుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న క్రమంలో నివారణకు జిల్లా యంత్రాంగం కదిలింది. కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్రెడ్డి, బల్దియా కమిషనర్ క్రాంతి, డీఏవో వాసిరెడ్డి శ్రీధర్ ఆదివారం కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. కార్పొరేటర్ సల్ల శారదారవీందర్ పురుగుల నివారణ మందులను పిచికారీ చేయించారు.
జాగ్రత్తలు పాటించాలి
ఈ పురుగులతో వాహదారులు ఇబ్బంది పడుతున్న విషయాన్ని సీపీ కమలాసన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన వ్యవసాయాధికారులకు సమాచారం ఇవ్వడంతో వాటిపై పరిశోధనకు జయశంకర్ యూనివర్సిటీ కీటక విభాగానికి నమూనాలు పంపించారు. పురుగుల జాతి, స్వభావం తెలిసిన తర్వాత నివారణ చర్యలు చేపడతాం.. వాహనదారులు ఇక్కడి నుంచి వెళ్లేటపుడు జాగ్రత్తగా ఉండాలి.
-కృష్ణారెడ్డి ఎస్ఐ, ఎల్ఎండీ
పంటలకు నష్టం లేదు..
క్యాడిష్ ఫ్లై పురుగుల వల్ల పంటలకు నష్టం ఉండదు. ఈ పురుగులు ఇప్పటి వరకు వ్యవసాయ శాఖ జాబితాలో లేదు. వీటి నమూనాలను కీటక విభాగం శాస్త్రవేత్తలు వచ్చి సేకరించారు. పరిశోధనల అనంతరం నివారణకు కావాల్సిన చర్యలు తీసుకుంటాం. శనివారం డీఏవో శ్రీధర్, పోలీసులతో కలిసి సమీక్షించాం.
-జే సురేందర్, ఏవో, తిమ్మాపూర్.
ఇవి కూడా చూడండి..
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్: 15 మంది జవాన్లు గల్లంతు!
నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం