లండన్: క్రిప్టో కరెన్సీలపై చైనా పీపుల్స్ బ్యాంకు కొరడా ఝుళిపించింది. దీంతో క్రిప్టో మేజర్ విలువ 30 వేల డాలర్ల దిగువకు పడిపోయి 29,719 డాలర్లకు చేరింది. దాదాపు ఐదు నెలల క్రితం గత జనవరి 27న 29,614 డాలర్ల వద్ద ట్రేడయింది. తర్వాత బిట్ కాయిన్ ఇంత భారీగా నష్టపోవడం ఇదే తొలిసారి.
కాయిన్ డెస్క్ డేటా ప్రకారం బిట్ కాయిన్ 8 శాతానికి పైగా నష్టపోయి 29,719 డాలర్లకు చేరుకున్నది. రెండో క్రిప్టో కరెన్సీ ఎథేర్ సైతం 10 శాతం నష్టపోయింది. 2000 డాలర్లకు దిగువన 1,768 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతున్నది.
గత 24 గంటల్లో డోజ్ కాయిన్ సుమారు 25 శాతం నష్టపోయి 0.17 డాలర్ల స్థాయికి పరిమితమైంది. ఎక్స్ఆర్పీ, లైట్ కాయిన్ కూడా 10 శాతానికి పైగా నష్టపోయాయి. ఫిబ్రవరిలో ఎలన్ మస్క్ ట్వీట్లతో గత ఏప్రిల్లో 64 వేల డాలర్ల పై చిలుకు ఆల్టైం రికార్డు నెలకొల్పింది బిట్ కాయిన్.
కానీ పర్యావరణానికి ముప్పుగా వాటిల్లే బిట్ కాయిన్తో తమ కార్ల విక్రయాలను అనుమతించబోమని ఎలన్ మస్క్ ఇటీవల ప్రకటించారు. మరోవైపు చైనా ప్రభుత్వం, ఆర్థిక నియంత్రణ సంస్థలు.. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, మైనింగ్పై నిషేధం విధించాయి.
గత నెల నుంచి బిట్ కాయిన్ విలువ సుమారు 35 శాతం హరించుకుపోయింది. తాజాగా చైనా పీపుల్స్ బ్యాంక్ స్పందిస్తూ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్పై కొరడా ఝుళిపించాలని దేశంలోని పెద్ద బ్యాంకులు, పేమెంట్ సంస్థలను ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.