ముంబై, జూన్ 3: కరోనా పీడిత రంగాల్లో విమానయాన పరిశ్రమ కూడా ఉన్నది. ఈ ప్రాణాంతక వైరస్ కట్టడికి చేపడుతున్న లాక్డౌన్లు, ఇతరత్రా ఆంక్షలతో ఎయిర్లైన్స్ ఇప్పటికే పీకల్లోతు నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలో కొవిడ్-19 సెకండ్ వేవ్.. పరిస్థితిని మరింత దిగజార్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22) భారతీయ విమానయాన సంస్థలు 4.1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.30వేల కోట్లు) ఏకీకృత నష్టాలను చవిచూడవచ్చని ఏవియేషన్ కన్సల్టెన్సీ అండ్ రిసెర్చ్ సంస్థ క్యాపా గురువారం తమ నివేదికలో అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2020-21)లోనూ ఇంచుమించుగా ఈ స్థాయి నష్టాలే వాటిల్లగా, ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఇండియన్ ఎయిర్లైన్స్ కంపెనీల నష్టాలు సుమారు 8 బిలియన్ డాలర్లకు చేరే ప్రమాదం కనిపిస్తున్నది. ఇందులో ఎయిర్ ఇండియా, ఇండిగో నష్టాలే 4.5 బిలియన్ డాలర్లు ఉండొచ్చని క్యాపా అంటుండటం గమనార్హం. ఇక కరోనా దృష్ట్యా 2020-21లో దేశీయ విమాన ప్రయాణీకులు 52.5 మిలియన్లకు పడిపోయారన్న క్యాపా.. ఈ 2021-22లో 80-95 మిలియన్లకు పెరగొచ్చని అభిప్రాయపడింది. ద్వితీయార్ధంలో పరిస్థితులు మెరుగు పడవచ్చన్న ఆశాభావాన్ని కనబర్చింది. నిజానికి 2019-20లో దాదాపు 140 మిలియన్లుగా ఉన్నారని గుర్తుచేసింది. అయితే కరోనా థర్డ్ వేవ్ వస్తే ఈసారీ ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పడిపోయే అవకాశాలు లేకపోలేదు. కాగా, ఈ ఏప్రిల్తో పోల్చితే మే నెలలో దేశీయ విమాన ప్రయాణీకులు 57.3 లక్షల నుంచి 19.20 లక్షలకు తగ్గినట్లు తేలింది.
వ్యూహాత్మక విలీనాలు?
ప్రస్తుత కరోనా ఆంక్షలు తొలగిపోతే దేశీయ విమానయాన పరిశ్రమలో వ్యూహాత్మక విలీనాలకు అవకాశం ఉందని క్యాపా ఈ సందర్భంగా పేర్కొన్నది. అయితే ఈ ఏకీకృత ప్రణాళికలు, ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ జరగనైట్లెతే భారతీయ విమానయాన రంగంలోకి మరిన్ని కొత్త సంస్థలు వచ్చినా రావచ్చన్నది. ముఖ్యంగా 1-2 స్టార్టప్లకు వీలుందన్న క్యాపా.. ఇదే జరిగితే దేశీయంగా మొత్తం 8-9 ఎయిర్లైన్స్ అందుబాటులో ఉంటాయన్నది. అలాగే కాలం చెల్లిన పాత విమానాలు పోయి, సాంకేతికంగా కొత్త విమానాలను ఆయా సంస్థలు అందిపుచ్చుకోవచ్చని కూడా అంచనా వేసింది.
నిధుల కొరత తీవ్రం
వ్యాపారం లేక సతమతమవుతున్న ఎయిర్లైన్స్కు ఇప్పటికే ఉన్న రుణ భారం, సంస్థాగత నిర్వహణ వ్యయం, ముఖ్యంగా పెరుగుతున్న ముడి చమురు ధరలు, రూపాయి మారకం విలువ పతనం, ఎయిర్పోర్టు చార్జీలు గుదిబండలా పరిణమిస్తున్నాయి. దీంతో కొత్తగా నిధులను సమకూర్చుకోవడం అనివార్యంగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రీక్యాపిటలైజేషన్ అంత సులువు కాదన్న అభిప్రాయాన్ని క్యాపా వెలిబుచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం దేశీయ విమానయాన సంస్థలకు కనీసం 5 బిలియన్ డాలర్ల ఫండ్సైనా అవసరం ఉంటుందని చెప్తున్నది. ఈ క్రమంలో ఐపీవోలకు వెళ్లినా ఫలితం ఉండకపోవచ్చన్నది.