Big blow to Maruti Suzuki | దేశంలోనే ప్రముఖ ప్రయాణికుల కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి షాక్ తగిలింది. డీలర్లపై ఆంక్షలు విధిస్తూ విధానాన్ని రూపొందించినందుకు కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మండి పడింది. మారుతి సుజుకిపై రూ.200 కోట్ల జరిమాన విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు జారీ చేసిన 60 రోజుల్లో సదరు జరిమాన డిపాజిట్ చేయాలని స్పష్టం చేసింది.
కార్ల కొనుగోలుదారులకు మరిన్ని డిస్కౌంట్లు ఇవ్వకుండా డీలర్లను నిరోధిస్తున్నదని మారుతి సుజుకిపై అభియోగం. మారుతి యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీస్ విధానాలు అమలు చేస్తున్నదని సీసీఐ నిర్వహించిన దర్యాప్తులో తేలింది. అదనపు డిస్కౌంట్లు ఇస్తున్న డీలర్లపై మారుతి సుజుకి ఫైన్ కూడా విధించింది. మారుతి సుజుకి డిస్కౌంట్ నియంత్రణ విధానం కింద డీలర్లు అదనపు డిస్కౌంట్లు ఇవ్వకుండా నియంత్రిస్తున్నది.
తమను కస్టమర్లకు అదనపు డిస్కౌంట్లు ఇవ్వకుండా నియంత్రిస్తున్నదని డీలర్ సీసీఐకి 2017లో ఈ-మెయిల్లో ఫిర్యాదుచేశారు. మారుతి సుజుకి.. కాంపిటిషన్ యాక్ట్-2002కు, కస్టమర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పని చేస్తున్నదని పేర్కొన్నారు. ముంబై, గోవా మినహా మహారాష్ట్రలోని వెస్ట్-2 రీజియన్ పరిధిలోని డీలర్లను అదనపు డిస్కౌంట్లు ఇవ్వడానికి అనుమతించడం లేదని ఆరోపించారు.