హైదరాబాద్: బ్రెజిల్ ఫార్మాస్యూటికల్ సంస్థ ప్రెకిసా మెడికమెంటోస్ అండ్ ఎన్విక్సియా ఫార్మాస్యూటికల్స్పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో కోవిడ్-19 వ్యాక్సిన్ కోవాగ్జిన్ తయారీ కోసం ప్రెకిసా సంస్థతో కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాన్ని భారత్ బయోటెక్ రద్దు చేసుకున్నది. ఈ విషయమై శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.
బ్రెజిల్కు 20 మిలియన్ల వ్యాక్సిన్ డోస్ల సరఫరాపై ఆ దేశ ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్న తర్వాత ప్రెకిసాతో ఎంవోయూ రద్దు చేసుకోవడం గమనార్హం. ప్రెకిసా లావాదేవీలపై బ్రెజిల్ అధికారులు విచారణ చేపట్టడంతో ఆదేశానికి వ్యాక్సిన్ల పంపిణీ వివాదాస్పదమైంది.
బ్రెజిల్లో భారత్ బయోటెక్ పార్టనర్గా ప్రెసికా మెడికమెంటోస్ ఉంది. గైడెన్స్, అసిస్టెన్స్, గైడెన్స్తోపాటు రెగ్యులేటరీ సంస్థలకు లేఖలు, దరఖాస్తుల సమర్పణలో మద్దతుగా నిలిచింది. లైసెన్స్, పంపిణీ, బీమాతోపాటు ఫేస్-3 ట్రయల్స్ నిర్వహణ తదితర అంశాలపై భారత్ బయోటెక్కు ప్రెసికా సహాయకారిగా నిలిచింది.
తక్షణం ప్రెసికా మెడికమెంటోస్తో కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేస్తున్నాం. కానీ దీంతో సంబంధం లేకుండా కోవాక్సిన్కు నియంత్రణ అనుమతుల కోసం బ్రెజిలియన్ డ్రగ్ రెగ్యులేటరీ సంస్థ అన్విసాతో నిరంతరం కలిసి పని చేస్తాం అని భారత్ బయోటెక్ వెల్లడించింది.
వివిధ దేశాల్లో కొవాగ్జిన్ వ్యాక్సిన్కు రెగ్యులేటరీ, చట్టపరమైన అనుమతుల కోసం ప్రయత్నిస్తున్నది. బ్రెజిల్లో కొవాగ్జిన్ను ప్రవేశపెట్టేందుకు ప్రెసికాతో భారత్ బయోటెక్ గతేడాది నవంబర్లో ఒప్పందం కుదుర్చుకున్నది.