వారం రోజుల్లో ఇండ్లను అందుబాటులోకి తేవాలి
కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
గజ్వేల్ రూరల్, మార్చి 31: సకల వసతులతో అద్భుతంగా మోడల్ కాలనీని ముంట్రాజ్పల్లి సమీపంలో వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకరావాలని కలెక్టర్ వెంక్రటామ్రెడ్డి అన్నారు. బుధవారం ఆర్అండ్ఆర్ కాలనీ కార్యాలయంలో రెవెన్యూ, ఇంజినీరింగ్, ఏజెన్సీ ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. అంతకు ముందు క్షేత్రస్థాయిలో అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో కలిసి కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను పరిశీలించి త్వరగా అందుబాటులోకి తీసుకరావాలని సూచించారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు ఆర్అండ్ఆర్ కాలనీలో ప్రారంభమవుతాయని, సకల వసతులతో దేశంలో ఎక్కడ లేని విధంగా ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మాణాన్ని చేపడుతన్నామన్నారు. ఇండ్లలో చేపట్టిన నల్లాల బిగింపు, ఇంటి పరిసర ప్రాంతాల్లో ఎత్తు, పల్లాలను చదును చేయడం, కలర్లు వేయడాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలన్నారు. సీఎం కేసీఆర్ రాష్టాన్ని సస్యశామలం చేసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నరన్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా నిర్వాసితులైన ప్రజలకు అన్ని వసతులతో ఆర్అండ్ఆర్ కాలనీ నిర్మించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. పల్లెపహాడ్ కాలనీలో 477 ఇండ్లను వారం రోజుల్లో అందుబాటులోకి తేవాలని వేములఘాట్లోని 446 ఇండ్లను రెండు ఫెజ్లుగా విభజించుకొని ఇండ్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకరావాలన్నారు. క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని వేగవంతం చేసేందుకు పల్లెపహాడ్ కోసం తహసీల్దార్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని, అందులో తహసీల్దార్తో పాటు ఉప కార్యనిర్వాహక ఇంజినీర్, ఏజెన్సీ ప్రతినిధి, ఎంపీడీవో, ఏపీవో, సాంకేతిక సహాయకులు సభ్యులుగా ఉంటారన్నారు. ఆర్అండ్ఆర్ కాలనీలో అసంపూర్తిగా ఉన్న మురుగుకాల్వల నిర్మాణం, రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్ తదితర పనులను వెంటనే ఏజెన్సీల సహకారంతో పూర్తి చేసేందుకు బృందం అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుంటారన్నారు.
ఆప్యాయంగా పలకరిస్తూ…
ఆర్అండ్ఆర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇండ్లను చూసేందుకు వచ్చిన ముంపు గ్రామాల ప్రజలను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ కలెక్టర్ వెంక్రటామ్రెడ్డి కాలనీలో కలియతిరిగారు. త్వరలోనే అద్భుతంగా ఇండ్లను నిర్మించి ప్రతి ఒక్కరికీ అందజేస్తామన్నారు. కాలనీలో తిరుగుతున్న సమయంలో అధికారులు, ఏజెన్సీల ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరగా అందుబాలోకి వచ్చే విధంగా మ్యాన్ పవర్ను వీలైనంత ఎక్కువగా వినియోగించుకొని ఇండ్లను సిద్ధ్దం చేయలన్నారు. సమీక్షలో అదనపు కలెక్టర్ పద్మాకర్, జిల్లా రెవెన్యూ అధికారి చెన్నయ్య, ఆర్డీవోలు విజయేందర్రెడ్డి, అనంతరెడ్డి, జయచంద్రారెడ్డి, ఎస్ఈలు శ్రీచారి, కనకరత్నం, డీఈలు రామచంద్రం, ఏజెన్సీ ప్రతినిధులు పాల్గొన్నారు.