సంగారెడ్డి, మే19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) సభ్యుడిగా సీఎం కేసీఆర్ నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ చైర్మన్గా సీనియర్ ఐఏఎస్ అధికారి బి.జనార్దన్రెడ్డి, సభ్యులుగా వివిధ రంగాలకు చెందిన ఏడుగురిని బుధవారం నియమించింది. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ సభ్యుడిగా నియమితులయ్యారు. ఆయన నియామకంపై జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, విద్యావేత్తలు,జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్యనారాయణ స్వగ్రామం మెదక్ జిల్లా కుల్చారం మండలం వరిగుంత గ్రామస్తులతో పాటు సంగారెడ్డికి చెందిన పలువురు సంతోషం వ్యక్తం చేశారు. బుధవారం టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు సంగారెడ్డిలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. తనను టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించిన సీఎం కేసీఆర్కు సత్యనారాయణ ధన్యవాదాలు తెలియజేశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణ బీఏ వరకు విద్యనభ్యసించారు. 1985లో జర్నలిస్టుగా కెరీర్ ప్రారంభించారు. జర్నలిస్టుగా ఈనాడు, ఉదయం, వార్త పత్రికల్లో చాలాకాలం పాటు ఆదిలాబాద్, కడప, కర్నూల్, హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలో పనిచేశారు.
కొంతకాలం మంజీరా, సలామ్ హైదరాబాద్ అనే పత్రికలను సొంతంగా నడిపారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పోరాడిన సత్యనారాయణ, సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. టీఆర్ఎస్ మద్దతుతో 2007లో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీచేసి విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో భాగంగా 2008లో ఆర్.సత్యనారాయణ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశారు. టీఆర్ఎస్లో పలు పదవులను నిర్వహించారు. టీఆర్ఎస్ పొలిట్బ్యూరో సభ్యుడిగా, ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా, సంగారెడ్డి నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జిగా పలు పదవులను నిర్వర్తించారు. సీఎం కేసీఆర్ మెదక్ ఎంపీగా పోటీచేసిన సమయంలో ఆయన ఎలక్షన్ ఏజెంట్గా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన మంత్రి హరీశ్రావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయి. నీటిగోస, అక్షరాయుధం అనే పుస్తకాలను రాసి విమర్శకుల మన్ననలు పొందారు. సామాజిక సమస్యలపై లోతైన అవగాహన ఉండడంతో పాటు జర్నలిజం, విద్య, ఉపాధి రంగాలపై అవగాహన ఉన్న సత్యనారాయణను సీఎం కేసీఆర్ టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించడంతో అన్నివర్గాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పాపన్నపేట,19 మే: తెలంగాణ ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ తగిన గుర్తింపునిస్తున్నారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన ఆడబిడ్డ తానోబా సుమిత్రా ఆనంద్కు టీఎస్పీఎస్సీలో సభ్యురాలిగా సీఎం అవకాశం కల్పించారు. దీంతో ఆమె స్వగ్రామం ఆరేపల్లిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామానికి చెందిన మాణిక్యరావు, విఠల్బాయి దంపతులకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుళ్లు. మూడో కూతురు సుమిత్రాను కామారెడ్డి జిల్లా చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన విద్యావేత్త ఆనంద్తో వివాహం చేశారు. ప్రస్తుతం కామారెడ్డి ప్రాంతంలో తెలుగు పండిట్గా ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న సమయంలో సుమిత్రా ఆనంద్ కామారెడ్డి ప్రాంతంలో అలుపెరుగని పోరాటం చేశారు. దీంతో అప్పటి ఉద్యమనేత కేసీఆర్ దృష్టిలో పడ్డారు. సీఎం కేసీఆర్తో సుమిత్రా ఆనంద్ కుటుంబానికి సత్సంబంధాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఉద్యమంలో ఆమె సేవలను గుర్తించి టీఎస్పీఎస్సీ సభ్యురాలిగా అవకాశం కల్పించారు. ఆమె నియామకంపై ఆరేపల్లి సర్పంచ్ శ్రీనాథ్రావు, కుర్తివాడ మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ ఆరె రాజేందర్రావు, ఆరేపల్లి గ్రామానికి చెందిన ఫిజియోథెరపిస్ట్ రమేశ్, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు..
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా తనను నియమించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు. నియామకానికి సహకరించిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావుకు ధన్యవాదాలు. సీఎం కేసీఆర్ నాపై ఎంతో నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది. ఆయన ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా నా బాధ్యతలు నిర్వహిస్తా. యువతకు ఉద్యోగాల కల్పన కోసం చిత్తశుద్ధితో పనిచేస్తా.
సేవలకు గుర్తింపు..
మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణను టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించినందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, సహకరించిన మంత్రి హరీశ్రావుకు ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో ఆయన చురుగ్గా పనిచేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారు. జర్నలిస్టుగా సామాజిక సమస్యలపై తన కలంలో ఎన్నో కథనాలు రాశారు.
త్యాగానికి గుర్తింపు లభించింది..
రంగోలి సత్యనారాయణ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. జర్నలిస్టుగా మెరుగైన సమాజ నిర్మాణానికి కృషి చేశారు. సీఎం కేసీఆర్ సత్యనారాయణను టీఎస్పీఎస్సీ సభ్యుడిగా నియమించడం త్యాగానికి గుర్తింపు లభించింది. ఇందుకు వరిగుంతం గ్రామం నుంచి సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు.
ఉద్యమ బిడ్డకు న్యాయం జరిగింది..
విద్యార్థి దశలోనే తొలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొని అన్ని సామాజిక వర్గాలను ఏకం చేసిన నాయకుడు రంగోలి సత్యనారాయణ. సీఎం కేసీఆర్ ఏ పిలుపు నిచ్చినా స్పందించి ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. ఉద్యమ బిడ్డకు న్యాయం చేసినందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు.