నేటినుంచి అమల్లోకి కొత్త పనివేళలు
లాక్డౌన్ నేపథ్యంలో మార్పులు
హైదరాబాద్, మే 12(నమస్తే తెలంగాణ): తెలంగాణలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో బ్యాంకులు పనివేళల్లో మార్పుచేసాయి. మే 13 గురువారం నుంచి బ్యాంకులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలవరకూ పనిచేస్తాయి. అత్యవసర సేవల్లో భాగంగా బ్యాంకులు, ఏటీఎంలను లాక్డౌన్ నుంచి మినహాయిస్తున్నట్లు, అవి యధావిధిగా పనిచేస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, పనివేళల్ని ఉదయానికే పరిమితం చేయాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సూచనల మేరకు కుదించిన పనివేళల్లో నగదు డిపాజిట్, విత్డ్రాయిల్, చెక్కుల క్లియరెన్స్, రెమిటెన్సులు, ప్రభుత్వ కార్యకలాపాలు మాత్రమే నిర్వహించనున్నట్లు స్టేట్లెవల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్ క్రిషన్ శర్మ చెప్పారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలవరకే ప్రజలకు లాక్డౌన్ నుంచి మినహాయింపు వున్నందున, రోజంతా తెరిచినప్పటికీ ఉపయోగం లేదన్న కారణంగా బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారి రామకృష్ణ తెలిపారు.