ప్రైవేటీకరణపై బ్యాంకుల సమ్మె

- మార్చి 15, 16 తేదీల్లో నిర్వహణకు యూఎఫ్బీయూ పిలుపు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్బీ)ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మె నిర్వహించాలని బ్యాంకు సంఘాలు నిర్ణయించాయి. మార్చి 15, 16 తేదీల్లో ఈ సమ్మె నిర్వహించాలని యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) పిలుపునిచ్చింది. పెట్టుబడుల ఉపసంహరణ ప్రణాళికలో భాగంగా త్వరలో రెండు పీఎస్బీలను ప్రైవేటీకరించనున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గత వారం కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన విషయం విదితమే. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించాలని మంగళవారం యూఎఫ్బీయూ సమావేశంలో నిర్ణయించినట్లు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఏఐబీఈఏ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. ఐడీబీఐ బ్యాంకుతోపాటు మరో రెండు పీఎస్బీల ప్రైవేటీకరణ, బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు, ఎల్ఐసీలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రైవేటీకరణ, దేశీయ బీమా రంగంలోకి 74 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించడం లాంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు ఆయన వివరించారు. ఇవన్నీ తిరోగమన చర్యలని, అందుకే వాటిని వ్యతిరేకించాల్సిన అవసరమున్నదని వెంకటాచలం పేర్కొన్నారు.