Bank of India | పండుగల సీజన్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) తన ఖాతాదారులకు తీపి కబురందించింది. ఇండ్లు, వెహికల్ లోన్లపై 50 బేసిక్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇండ్ల రుణాలపై 35 బేసిక్ పాయింట్లు, కార్ల రుణాలపై 50 బేసిక్ పాయింట్లు వడ్డీ తగ్గిస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు.. రుణాలపై వన్టైం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు తెలిపింది.
ఇంతకుముందు 6.85 శాతం వడ్డీరేటుపై ఇండ్ల రుణాలు ఇస్తున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక 6.5 శాతం వడ్డీపై అందజేయనున్నది. ఇక వెహికల్ రుణాలు (కార్ల రుణాలు) 7.35 శాతం వడ్డీపై మంజూరు చేసింది. ఇక ఇప్పుడు 6.85 శాతం వడ్డీకి మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. సోమవారం (అక్టోబర్ 18) నుంచి తగ్గించిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరు వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని వివరించింది.
ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యెస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా ఫెస్టివ్ సీజన్ సందర్భంగా ఇండ్లు, కార్లు, ఇతర వాహన రుణాలపై వడ్డీరేట్లపై రాయితీ కల్పిస్తున్నాయి.