న్యూఢిల్లీ: ఇంటి రుణం మొదలు రిటైల్ రుణాలపై బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వడ్డీరేట్లు తగ్గించింది. ఈ నెల 15 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు బీవోబీ తన రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (బీఆర్ఎల్ఎల్ఆర్) ను 6.85 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గిస్తున్నట్లు సోమవారం తెలిపింది. అన్ని రకాల రిటైల్ రుణాలకు రెపో లింక్డ్ రేట్ ఆటోమేటిక్గా వర్తిస్తుందని వెల్లడించింది.
ఇంటి రుణాలు, మార్టగేజ్ లోన్లు, కార్ల కొనుగోలు రుణాలు, విద్యారుణం, వ్యక్తిగత రుణంతోపాటు అన్ని రకాల రిటైల్ లోన్లపై వడ్డీరేటు తగ్గింపు వర్తిస్తుంది. దీని ప్రకారం ఇంటి రుణాలపై 6.75 శాతం, కార్ల రుణాలు 7 శాతం, మార్టగేజ్ లోన్ వడ్డీరేటు 7.95 శాతం, విద్యా రుణం 6.75 శాతం నుంచి మొదలవుతుంది. అయితే, మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్)లో మాత్రం ఎటువంటి మార్పులు ఉండబోవని గతవారమే బీవోబీ స్పష్టం చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా మార్టగేజెస్ అండ్ అదర్ రిటైల్ అసెట్స్ విభాగం జనరల్ మేనేజర్ హర్షద్ కుమార్ టీ సోలంకి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘బీఆర్ఎల్ఎల్ఆర్ తగ్గింపుతో మా కస్టమర్లకు చౌకగా రుణాలు లభిస్తాయి. అత్యంత చౌక వడ్డీరేట్లపై మా కస్టమర్లు త్వరితగతిన సులువుగా రుణాలు పొందేందుకు డిజిటల్ ప్రక్రియ ఉపకరిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. ఈ ఆఫర్ ఈ నెలాఖరు వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
ఇంతకుముందు ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ తొలుత రూ.75 లక్షల వరకు ఇంటి రుణాలను 6.70 శాతంపై, రూ.75 లక్షలు దాటిన రుణాలపై 6.75 శాతం వడ్డీరేట్లు అమలవుతాయని పేర్కొంది. అటుపై ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ.. 6.70 శాతానికే ఇంటి రుణాలు అందజేస్తామని తెలిపింది. కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ కూడా ఇంటి రుణాలపై వడ్డీరేట్లు తగ్గించాయి.