న్యూఢిల్లీ, మార్చి 9: ప్రభుత్వ రంగంలోని మరో రెండు బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగ సంఘాలు త్వరలో సమ్మె నిర్వహించనున్నాయి. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ సమ్మె నిర్వహించాలని తొమ్మిది ప్రధాన సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) ఇటీవల పిలుపునిచ్చింది. దీంతో ఈ రెండు రోజులు తమ సేవలకు విఘాతం కలగవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎక్సేంజ్ ఫైలింగ్లో వెల్లడించింది. సమ్మె సందర్భంగా అన్ని శాఖలు యథాతథంగా పనిచేసేలా ఏర్పాట్లు చేశామని, అయినప్పటికీ తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడవచ్చని పేర్కొన్నది. ఈ సమ్మె వల్ల ఎంత నష్టం వాటిల్లుతుందో ఇప్పుడే చెప్పలేమని ఎస్బీఐ స్పష్టం చేసింది