న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో మరో కొత్త బైక్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తన విజయవంతమైన మోడల్ ప్లాటినాకు కొత్త హంగులు జోడించి ప్లాటినా-110 పేరుతో గురువారం విడుదల చేసింది. 115 సీసీ ఇంజిన్తో వస్తున్న ఈ బైక్లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) అందిస్తుండడం ప్రత్యేకత. ఏబీఎస్లో 240 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఉంటుంది. ట్యూబ్లెస్ టైర్లతో వస్తున్న ఈ బైక్ ధర రూ.65,920 గా కంపెనీ నిర్ణయించింది.
దేశ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ సెగ్మెంట్ ఏబీఎస్ టెక్నాలజీని తీసుకొచ్చామని బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (డొమెస్టిక్ మోటార్ సైకిల్ యూనిట్) సారంగ్ కనడే ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే సుమారు 70 లక్షల మంది ప్లాటినాను సొంతం చేసుకున్నారని చెప్పారు.
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం వల్ల సడన్ బ్రేక్ వేసినప్పుడు స్కిడ్ కాకుండా, అదుపు తప్పి పడిపోకుండా నివారించే సామర్థ్యం ఈ బైక్కు వుంటుంది. రీ ఫ్రెష్డ్ లుక్ గల ఇంప్రూవైజ్డ్ విజిబిలిటీ గల నూతన మిర్రర్స్తో బండి నడుపుతున్నప్పుడు హ్యాండ్గార్డ్స్తో అదనపు భద్రత లభిస్తుంది.
చార్కోల్ బ్లాక్, వొల్కానిక్ రెడ్, బీజ్ బ్లూ రంగుల్లో వినియోగదారులకు ఈ బైక్ లభిస్తుంది. దేశంలోని అన్ని బజాజ్ డీలర్షిప్ల వద్ద ఈ బైక్ లభ్యం అవుతుంది. టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్, హోండా సీడీ 110 డ్రీమ్, టీవీఎస్ రేడియాన్, హీరో స్పెండ్లర్ ప్లస్ తదితర బైక్లకు బజాజ్ ప్లాటినా 110 గట్టి పోటీనిస్తుందని భావిస్తున్నారు.