యాదాద్రి భువనగిరి, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా.. కరోనా..బాధితుల్లో ఈ వైరస్ అంతులేని భయాన్ని కలిగిస్తోంది. సకాలంలో స్పందించక చాలామంది కరోనాను జయించలేక పోతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో ముందు చూపుతో చేపట్టిన ఇంటింటా నిర్వహించిన జ్వర సర్వే బాధితులకు ఆశావహంగా నిలుస్తోంది. ఇంటివద్దనే మందులు అందజేయడం..ఆరోగ్య జాగ్రత్తలను వివరించడం వంటి చర్యలు కరోనాను జయించే దివ్య ఔషధంగా ఉంటున్నాయి. ఇదే క్రమంలో.. సర్వే సందర్భంగా బాధితుల ఫోన్ నంబర్లను సేకరించి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ‘మానిటరింగ్ సెల్’ నుంచి రోజూ మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు బాధితుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకుంటూనే.. అవసరమైన మందులు, బెడ్లు, ఆక్సిజన్ వంటి సదుపాయాలను సైతం సమకూర్చేలా కాల్ సెంటర్ తోడ్పాటునందిస్తోంది. మానిటరింగ్ వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేసే ప్రతి సమస్యను తక్షణమే పరిష్కరించే దిశగా కలెక్టర్ అనితారామచంద్రన్ చర్యలు తీసుకుంటున్నారు.
అందుబాటులో సేవలు
జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. ప్రతి రోజూ వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో కట్టడికి జిల్లా యంత్రాంగం పకడ్బందీగా వ్యవహరిస్తోంది. మేలో రెండు విడుతలుగా చేపట్టిన జ్వర సర్వే సందర్భంగా కరోనా లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వారికి హోం ఐసొలేషన్ కిట్లు అందించారు. ఇదే క్రమంలో జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ‘కొవిడ్ మానిటరింగ్ సెల్’ నుంచి హోం ఐసొలేషన్ కిట్లు అందుకున్న వారి ఆరోగ్య పరిస్థితితోపాటు, ప్రభుత్వ ఐసొలేషన్లలో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ప్రతి నిత్యం వెయ్యి మంది వరకు మానిటరింగ్ సెల్ నుంచి బాధితులకు ఫోన్లు వెళ్తున్నాయి. ఐసొలేషన్ పీరియడ్ 17 రోజుల పాటు క్రమం తప్పకుండా ఫోన్లు చేస్తున్నారు. మానిటరింగ్ సెల్ నిర్వహణ కోసం 25 మంది సిబ్బందిని డిప్యుటేషన్పై నియమించారు. రెండు షిప్టుల్లో ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకు 24 గంటలూ ఈ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి నిత్యం ఇద్దరు డాక్టర్లు, హెల్త్ సూపర్వైజర్, ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, కంప్యూటర్ సిబ్బందితో కలిపి ఆరుగురు రెండు షిప్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.
కలెక్టర్ నిరంతర పర్యవేక్షణ
జిల్లాలో మే 6 నుంచి 10 వరకు మొదటి విడుతలో, మే 23 నుంచి 28 వరకు రెండో విడుతలో జ్వర సర్వేను నిర్వహించారు. సర్వేలో హెల్త్ కిట్లను అందజేసిన వారి వివరాలను వైద్య ఆరోగ్యశాఖ కలెక్టరేట్లోని మానిటరింగ్ సెల్కు అందజేయగా..అందులోని ఫోన్ నంబర్ల ఆధారంగా బాధితులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ‘ భయాన్ని వీడాలని.. ధైర్యమే దీనికి మందు’ అని చెబుతూ వారి లో ఆత్మైస్థెర్యాన్ని పెంపొందించేలా చేస్తున్నారు. ఐసొలేషన్ కిట్లలోని మందులు ఎలా వేసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర సలహాలు, సూచనలు చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ఎవరిదైనా ఆరోగ్య పరిస్థితి విషమిస్తే..దవాఖాన వర్గాలకు సమాచారం చేరవేసి తక్షణ వైద్యం అందించేలా చొరవ చూపుతున్నారు. గత ఆగస్టు 3న ప్రారంభమైన ఈ సెల్ నుంచి ఇప్పటివరకు 92వేల మందికిపైగా బాధితులతో నిర్వాహకులు నేరుగా మాట్లాడారు. కలెక్టర్ అనితారామచంద్రన్ ప్రత్యేకించి మానిటరింగ్ చేసేందుకు వాట్సాప్ గ్రూప్ను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. వెంటనే వైద్యాధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. అధికారులతో జూమ్ ద్వారా సమీక్షలు నిర్వహిస్తూ బాధితులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వా రా మనో నిబ్బరాన్ని కల్పించే విషయమై అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేస్తున్నారు.
ఫోన్ చేస్తే సాయం
కలెక్టరేట్లో ప్రభుత్వం మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసింది. ప్రజలు ఫోన్ చేసి తమ ఆరోగ్యపరమైన సమస్యలను చెప్పుకునేందుకు సెల్ నెం.8685200020, 18004257106లను అందుబాటులో ఉంచారు. 24 గంటలపాటు పనిచేసే ఈ సేవల కోసం ఫోన్ చేస్తే సాయం చేసేందుకు అవసరమైన చర్యలను మానిటరింగ్ సెల్ సిబ్బంది చేపడుతారు. ఇంటింటి సర్వే సందర్భంగా ప్రజలందరికీ ఈ హెల్ప్లైన్ నంబర్లను వైద్య బృందాలు ఇచ్చాయి. ఈ నంబర్లకు ఇప్పటి వరకు 761 కాల్స్ వచ్చినట్లు సంబంధిత సిబ్బంది చెబుతున్నారు. అత్యవసర వైద్యుల కోసం ఎక్కువగా ఫోన్లు వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. కరోనా పాజిటివ్ ఉన్నవారికి ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్ల ద్వారా హెల్త్కిట్లను ఇంటివద్దకే పంపిస్తున్నారు. ప్రభుత్వ ఐసొలేషన్లలో అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ బెడ్స్ సదుపాయం తదితర సమాచారాన్ని సైతం అందించి సాయపడుతున్నారు. లాక్డౌన్లో భాగంగా హెల్ప్లైన్కు ఎవరైనా ఫిర్యాదు చేస్తే వెంటనే తగు చర్యలు తీసుకునేందుకు ఇద్దరు కానిస్టేబుళ్లను సైతం మానిటరింగ్ సెల్ వద్ద అందుబాటులో ఉంచుతున్నారు.
రోజుకు వెయ్యి మందికి ఫోన్ చేస్తున్నాం
ప్రభుత్వం జిల్లాలో జ్వర సర్వేను ముందు చూపుతో నిర్వహించడం వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. దీనికితోడు ప్రతి రోజూ జ్వర సర్వేలో హెల్త్ కిట్లను అందజేసిన వారి ఆరోగ్య స్థితిపై మానిటరింగ్ చేస్తున్నాం. కొవిడ్ మానిటరింగ్ సెల్ నుంచి నిత్యం వెయ్యి మందికి ఫోన్లు చేసి వారి బాగోగులను తెలుసుకుంటున్నారు. లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి సమీపంలోని దవాఖానలో చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. 24 గంటలు అందుబాటులో ఉన్న కాల్ సెంటర్కు ఫోన్ చేసి ఎంతోమంది భరోసాతోపాటు, అత్యవసర చికిత్స కోసం సాయం పొందుతున్నారు.
-సాంబశివరావు, డీఎంహెచ్వో, యాదాద్రి భువనగిరి జిల్లా
వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం
కరోనా బాధితుల ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేశాం. సెల్ ఏర్పాటుతో వస్తున్న ఫలితాలను చూసి చాలామంది అభినందిస్తున్నారు. ప్రజల నుంచి విశేష స్పందన వస్తుండడంతో సహాయం కోసం కాల్ సెంటర్ను ఆశ్రయిస్తున్నారు. జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్లో వచ్చిన వాటిపై వెంటనే స్పందించి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నాం. అవసరమైన మందులు అందజేయడంతోపాటు పడకలు, ఆక్సిజన్ బెడ్ల వివరాల సమాచారం ఇచ్చి అవసరమైనవారికి తక్షణ వైద్యం అందించేలా చూస్తున్నాం.
-అనితారామచంద్రన్, కలెక్టర్, యాదాద్రి భువనగిరి జిల్లా