న్యూఢిల్లీ: పర్యావరణ హిత విద్యుత్ వాహనాల తయారీలో బజాజ్ ఆటో ముందు ఉన్నది. వివిధ కంపెనీలు రోజుకో మోడల్ బైక్, స్కూటర్లను ఆవిష్కరిస్తూ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే హీరో ఎలక్ట్రిక్, ఈథర్, ఒకినావా సంస్థల సందడి మొదలైంది. తాజాగా ఈ జాబితాలో బజాజ్ ఆటో ఫ్రీ రైడర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
దేశీయ ద్విచక్ర వాహనాల మార్కెట్లో బజాజ్ ఆటోమొబైల్ సంస్థకు ప్రత్యేక స్థానం ఉంది. చేతక్ స్కూటర్ అంటే ఇండియన్లు ప్రాణం పెట్టేవారు. ఇక ఇప్పటికే యువతలో బజాజ్ పల్సర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
పలు బజాజ్ మోడల్ మోటారు సైకిళ్లంటే గ్రామీణ భారతీయులకు ఎంతో ఇష్టం. గ్రామీణ భారతంలో గణనీయ మార్కెట్ వాటా సంపాదించుకుంది బజాజ్ ఆటో.
బజాజ్ ఆటో మొబైల్ తాజాగా ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్పై ఫోకస్ చేసింది. ఇప్పటికే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో ఉంది. తాజాగా బజాజ్ ఆటో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను తీసుకు వస్తున్నది. ఇది ఈ ఏడాది చివరికల్లా విపణిలోకి రానున్నది.
ఫ్రీ రైడర్ పేరుతో కొత్త స్కూటర్ని విపణిలోకి తీసుకు రానున్నది. దీని ట్రేడ్ మార్క్ కోసం ఈ ఏడాది మార్చి ఒకటో తేదీన బజాజ్ ఆటో దరఖాస్తు చేసింది. విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడంలో ముందు ఉన్న కేంద్రం ఈ నెల ఒకటో తేదీన అనుమతులు ఇచ్చేసింది.